సాయిధరమ్‌ను పరామర్శించిన స్టైలిష్ స్టార్ బన్నీ

గురువారం, 16 సెప్టెంబరు 2021 (18:17 IST)
ఇటీవల హైదరాబాద్ నగరంలోని కేబుల్ వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్‌ను మరో మెగా హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురువారం ఆస్పత్రికెళ్లి పరామర్శించారు. తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నాడు.  
 
ప్రస్తుతం అర్జున్ పుష్ప షూటింగ్‌లో కాకినాడలో బిజీగా ఉన్నారు. దీంతో సాయిధరమ్ ప్రమాదం జరిగిన తర్వాత బన్నీకి ఆస్పత్రికి వెళ్లలేకపోయారు. తేజ్ ప్రమాదానికి గురైన వెంటనే మొదటి కాల్ బన్నీకే వచ్చిందని తెలిసింది. అత్యవసర చికిత్స కోసం తేజ్‌ను ముందుగా మెడికవర్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. 
 
ఆ హాస్పిటల్‌లో పనిచేస్తున్న బన్నీ స్నేహితులు వెంటనే ఈ సమాచారం అందించారు. దీంతో బన్నీ చిరంజీవితోపాటు అల్లు అరవింద్‌, వైష్ణవ్ తేజ్‌లకు ఫోన్ చేసి ప్రమాద విషయాన్ని తెలియజేశారని తెలిసింది. 
 
వారు హాస్పిటల్‌కు వెళ్లి.. సాయి ధరమ్ తేజ్ ప్రమాదం నుంచి బయటపడ్డాడని తెలియజేయడంతో బన్నీ కాకినాడలోనే ఉండిపోయాడు. తన షెడ్యూల్ పూర్తికావడంతో సాయి ధరమ్ తేజ్‌ను చూసేందుకు అల్లు అర్జున్ గురువారం హైదరాబాద్‌కు వచ్చి ఆస్పత్రికెళ్లి సాయిధరమ్‌ను పరామర్శించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు