ఏపీలో ఆగని కరోనా దూకుడు... ఉప ముఖ్యమంత్రికి పాజిటివ్

సోమవారం, 10 మే 2021 (18:58 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పెద్ద‌ సంఖ్య‌లో కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా ప్రజలతో ఎప్పుడు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధుల‌ను ఈ మ‌ధ్య‌ కాలంలో అధికంగా మ‌హ‌మ్మారి చుట్టుముడుతున్న‌ది. 
 
తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దాంతో ప్రస్తుతం ఆమె విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె భర్త పరిక్షిత్‌ రాజుకు కూడా ఇటీవ‌లే కరోనా సోకింది.
 
అలాగే, క‌ర్నూలు జిల్లాలోని పత్తికొండ ఎమ్మెల్యే కే. శ్రీదేవి కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యారు. వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌న్పించ‌డంతో ప‌రీక్ష‌లు చేయించుకోగా.. అందులో పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా పేర్కొన్నారు. 
 
తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింద‌ని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని చెప్పారు. గత ఐదు రోజులుగా తనను కలిసినవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు