వచ్చే ఏడాది జనవరి 9న అమ్మఒడి ల్యాప్‌టాప్‌లు, ఇంకా...

మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (19:34 IST)
గ్రామాలకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీ పురోగతి, గ్రామాల్లో వైయస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటు, వాటిలో మౌలిక సదుపాయాలు, నిర్వహణతో పాటు, అమ్మ ఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌ల అందజేతపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష జరిపారు.
 
సమీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..
 
2023 మార్చి నాటికి:
- గ్రామాలకు అన్‌ లిమిటెడ్‌ కెపాసిటీతో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండాలి. అందు కోసం అవసరమైతే కెపాసిటీని 20 జీబీ వరకు పెంచండి.
- అప్పుడే వర్క్‌ ఫ్రమ్‌ హోం సులభంగా సాధ్యమవుతుంది.
- కొత్తగా నిర్మిస్తున్న వైయస్సార్‌ జగనన్న కాలనీలలో కూడా ఇంటర్నెట్‌ కనెక్షన్లు ఇవ్వాలి. అంటే మరో 31 లక్షల ఇళ్లు పెరుగుతాయి. ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేయండి.
- తుపాను ప్రభావిత 108 గ్రామాల్లో కూడా భూగర్భ కేబుళ్లు వేయండి. 
- రాష్ట్ర వ్యాప్తంగా 2023 మార్చి నాటికి అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్ల ప్రక్రియ పూర్తి కావాలి.
 
వైయస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలు:
- రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో, గ్రామ సచివాలయం ఉన్న ప్రతీ చోటా వైయస్సార్‌ విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీ ఉండాలి.
- నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం గ్రామీణ లైబ్రరీల నిర్మాణం జరగాలి.
- అవి పూర్తయ్యే సమయానికి అవసరమైనన్ని కంప్యూటర్లు కూడా సిద్ధం చేయాలి.
- వైయస్సార్‌ విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీలో న్యూస్‌ పేపర్‌ స్టాండ్‌ కూడా ఏర్పాటు చేయాలి. 
- ఒక్కో లైబ్రరీలో 6 సిస్టమ్స్‌ ఏర్పాటు ప్రొవిజన్‌ ఉండాలి. అవసరం మేరకు 4 లేదా 6 కంప్యూటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు.
- గ్రామస్ధాయిలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు అవసరమైన ఇంటర్నెట్‌ స్పీడ్‌ ఉండాలి.
 
అమ్మ ఒడి ల్యాప్‌టాప్‌లు:
- అమ్మ ఒడి పథకం అమలు రోజు, అంటే వచ్చే ఏడాది జనవరి 9న, ల్యాప్‌టాప్‌లు కోరుకున్న వారికి అవి అందజేయాలి.
- 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్ధులకు ల్యాప్‌టాప్‌పై ఆప్షన్‌ ఇచ్చిన ప్రభుత్వం.
- మరోవైపు ల్యాప్‌టాప్‌ల సర్వీసు కూడా పక్కాగా ఉండాలి.
- ఎక్కడైనా ల్యాప్‌టాప్‌ చెడిపోతే దాన్ని గ్రామ సచివాలయంలో ఇస్తే, దాన్ని సర్వీస్‌ సెంటర్‌కు పంపించి, వారం రోజుల్లో తిరిగి తెప్పించాలి.
- కాబట్టి బిడ్‌ ఫైనల్‌ చేసేటప్పుడు, గ్యారెంటీ, వారంటీ, సర్వీస్‌.. వీటన్నింటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
- కాగా, ఆయా పనుల పురోగతిని సమావేశంలో అధికారులు వివరించారు.

గ్రామాల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్లకు సంబంధించి, ఇప్పటికే కేబుల్‌ పనులు కొనసాగుతున్నాయని, నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా 2023 మార్చి నాటికి పనులు పూర్తి చేస్తామని ఇంధన శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్‌ వెల్లడించారు. ఇప్పటివరకు 307 మండలాల్లోని 3642 గ్రామాల్లో 14,671 కిమీ మేర ఏరియల్‌ కేబుల్‌ వేయడం జరిగిందని ఆయన తెలిపారు.
 
మరోవైపు 690 చదరపు అడుగుల విస్తీర్ణంతో వైయస్సార్‌ విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీలు నిర్మిస్తున్నామని, ఒక్కో లైబ్రరీ నిర్మాణ వ్యయం అంచనా రూ.16 లక్షలు, కాగా, ప్రతి లైబ్రరీలో 20 సీట్లు ఏర్పాటు చేస్తున్నామని పంచాయతీరాజ్‌ గ్రామిణాభివృద్ధి కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్‌ వెల్లడించారు.
 
ఇక అమ్మ ఒడిలో ఆప్షన్‌ ప్రకారం ల్యాప్‌టాప్‌లు ఇవ్వడానికి ఇప్పటికే విద్యార్థుల నుంచి ఆప్షన్‌ తీసుకుంటున్నామని విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ తెలిపారు. రెండు మోడళ్లలో ల్యాప్‌టాప్‌లు సేకరిస్తున్నామన్న ఆయన, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు హైఎండ్‌ వర్షన్‌ ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని తెలిపారు.
 
అటవీ పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఐటీ «శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్, ఏపీ ఫైబర్‌ నెట్‌ సంస్థ ఛైర్మన్‌ పి.గౌతంరెడ్డి, ఏపీ ఫైబర్‌నెట్‌ సంస్థ ఎండీ ఎం.మధుసూధన్‌రెడ్డి, ఏపీటీఎస్‌ ఎండి ఎం.నందకిషోర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు