ఆంధ్రాలో 8 వేలకుపైగా కరోనా కేసులు - 88 మంది మృత్యువాత

ఆదివారం, 16 ఆగస్టు 2020 (22:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో ఎనిమిదివేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో ఈ కేసులు నమోదయ్యాయి. అలాగే, 88 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులిటెన్‌లో విడుదల చేసింది. 
 
గత 24 గంటల్లో 88 మంది మృత్యువాత పడగా, వీరిలో చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో పది మంది చొప్పున చనిపోయారు. కర్నూలు జిల్లాలో 9 మంది, నెల్లూరు జిల్లాలో 9 మంది చనిపోయారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మృత్యుఘంటికలు మోగించింది. దాంతో మొత్తం మరణాల సంఖ్య 2,650కి పెరిగింది.
 
ఇకపోతే, కొత్త కేసుల సంఖ్య ఇటీవల కాలంలో పది వేలకు పైగా నమోదవుతున్న తరుణంలో కొన్నిరోజులుగా క్రమంగా తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా 8,012 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 981 కేసులు వచ్చాయి. 
 
10,117 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 85,945 మంది చికిత్స పొందుతున్నారు. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,89,829 కాగా, వారిలో 2.01 లక్షలమంది కరోనా నుంచి కోలుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు