మూగ యువతిపై సామూహిక అత్యాచారం - ముగ్గురు మృగాళ్ల అఘాయిత్యం

వరుణ్

శనివారం, 15 జూన్ 2024 (09:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. మూగ యువతిపై ముగ్గురు మృగాళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పుట్టుకతో మూగ యువతి కావడంతో ఇంటి వద్దే ఉంటుంది. మాటలు రాని ఆ దీనురాలికి మాయమాటలు చెప్పి ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటన ఒంగోలు జిల్లా చీమకుర్తి మండలంలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. 
 
మండల కేంద్రానికి సమీపంలోని ఓ గ్రామంలో నిరుపేద కుటుంబం ఉంటోంది. వారి కుమార్తె పుట్టుకతోనే మూగ కావడంతో ఆమెను ఇంటి వద్దే ఉంచి పోషణ భారం చూసుకుంటున్నారు. తల్లిదండ్రులు పనులకు వెళ్లిన సమయంలో యువతి ఒంటరిగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని స్థానికంగా ఉండే ఓ యువకుడు ఆమెను ప్రేమిస్తున్నట్లు నటించాడు. మాయమాటలు చెప్పి ఏడాదిగా ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు.
 
యువతి దివ్యాంగురాలు కావడంతో ఆ యువకుడు తన స్నేహితులిద్దరిని కూడా కొంతకాలంగా వెంట తీసుకెళుతున్నాడు. ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో బెదిరించి వారు ముగ్గురూ గత కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. రెండు రోజుల క్రితం కుమార్తె గర్భం దాల్చిన విషయం గ్రహించిన తల్లి ప్రశ్నించడంతో ఆమె కన్నీరుమున్నీరైంది. 
 
బెదిరించి తనపై ముగ్గురు యువకులు అఘాయిత్యం చేస్తున్నారని చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి గురువారం చీమకుర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎట్టకేలకు గురువారం అర్థరాత్రి తర్వాత కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ దుర్గా ప్రసాద్‌ తెలిపారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. అయితే నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు