జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ మహోత్సవం.. 2022 జూన్ నాటికి పూర్తి

గురువారం, 3 జూన్ 2021 (08:48 IST)
ఆంధ్రప్రదేశ్‌లో సొంతింటి కల నెరవేరబోతోంది. ఇళ్ల నిర్మాణ మహోత్సవం జగన్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. వారం రోజుల్లో జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఏపీలో ఇళ్ల నిర్మాణ మహోత్సవం నిర్వహించనుంది ప్రభుత్వం. 
 
వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలతో పాటు, లబ్ధిదారులు సొంత స్థలంలో నిర్మాణం చేసుకుంటున్న ఇళ్ల పనులు ప్రారంభం కానున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ ముప్పై లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ నెల పది వరకు జగనన్న కాలనీల్లో పనులను లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం.
 
ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. రెండు దశలుగా చేపడుతున్న ఇళ్ల నిర్మాణ పథకం కోసం 50 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. మొత్తం 28 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనుండగా… మొదటి దశలో 15 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు 2021, జూన్ 03వ తేదీ గురువారం ప్రారంభించనున్నారు. 
 
ఈ మొదటి దశ పనులను 2022 జూన్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు ప్రణాళిక రూపొందించింది. మరో 12 లక్షల 7 వేల ఇళ్ల నిర్మాణాన్ని రెండో దశ కింద చేపట్టి వాటిని 2023 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఒక్కో ఇంటి నిర్మాణానికి కావాల్సిన అన్ని అవసరాలను పూర్తిగా ప్రభుత్వమే అందించనుంది.
 
రివర్స్ టెండరింగ్ ద్వారా ఇంటి నిర్మాణానికి కావాల్సిన సామాగ్రి, సిమెంటు తక్కువ ధరకు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిర్మాణ రంగంలో పనిచేసే వారికి 21 కోట్ల పనిదినాలు లభించే అవకాశం ఉందని అధికారుల అంచనా. జగనన్న కాలనీల్లో మొదటి దశలో 8 వేల 905 లే అవుట్లలో 11 లక్షలకుపైగా ఇళ్లను నిర్మాణం చేయనున్నారు. ఈ కాలనీలను పెద్ద గ్రామాలుగా తీర్చిదిద్దే దిశగా…సౌకర్యాల కల్పన కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు