ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ

శుక్రవారం, 7 ఆగస్టు 2020 (18:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. గత ఎన్నికల మేనిఫెస్టోలే వైకాపా పేర్కొన్నట్టుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఓ అధ్యయన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎస్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. 
 
మంత్రిమండలి నిర్ణయం మేరకు జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కోసం ఏర్పాటైన ఈ అధ్యయన కమిటీకి సీఎస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో సభ్యులుగా సీసీఎల్‌ఏ, జీఏడీ సర్వీసెస్ సెక్రటరీ, ప్రణాళికా శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారిని నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. కమిటీ కన్వీనర్‌గా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఉండనున్నారు.

లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య ఆధారంగా ఏపీలో 25 జిల్లాలు ఏర్పడనున్నాయి. కాగా, 3 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు నిర్దేశించారు. ఈ కమిటీ నివేదికను పరిశీలించిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ సర్కారు చర్యలు తీసుకోనుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం ఒక్కో ఎంపీ స్థానాన్ని ఒక్కో జిల్లాగా ప్రకటించనున్నారు. ఆ ప్రకారంగా ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుపతి త్వరలోనే జిల్లా కేంద్రంగా అవతరించనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు