జీతాలే ఇచ్చేందుకే గతిలేదు... త్రీ క్యాపిటల్స్ అవసరమా? జగన్ గారూ : వైకాపా ఎంపీ

శుక్రవారం, 7 ఆగస్టు 2020 (16:48 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీకి చెందిన అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకే డబ్బులు లేవని, ఇపుడు మూడు రాజధానులు అవసరమా? సీఎం జగన్ గారూ అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. 
 
పాలనావికేంద్రీకరణ పేరుతో 13 జిల్లాలకు మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ గట్టి సంకల్పంతో ఉన్న విషయం తెల్సిందే. దీనిపై వైకాపా ఎంపీగా ఉన్న రాజు గత కొన్ని రోజులుగ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని... ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని మార్పు అవసరమా? అని ప్రశ్నించారు. 
 
ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మార్చుకుంటూ పోవడం సరికాదని అన్నారు. అమరావతి రైతులకు న్యాయం చేయాలంటే రూ.80 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారు. రాజధాని గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు కూడా సరికాదన్నారు. 
 
అమరావతిలో రాజధాని వస్తుందని దాచుకున్న సొమ్ముతో మధ్యతరగతి ప్రజలు భూములు కొన్నారని రఘురాజు చెప్పారు. వారికి అన్యాయం చేయొద్దని కోరారు. అమరావతికి ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారో చెప్పాలని హైకోర్టు ఆదేశించడం మంచి పరిణామమన్నారు. రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ రెఫరెండంకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
 
ప్రొఫెసర్ నాగేశ్వర్‌ వంటి వ్యక్తులను కూడా బెదిరిస్తున్నారని రఘురాజు మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులు తనకు కూడా ఎదురయ్యాయని చెప్పారు. న్యాయ వ్యవస్థపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారని... దీనివల్ల ప్రభుత్వానికే అపారమైన నష్టం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు