మరో రెండు రోజుల తర్వాత వర్షాలే వర్షాలు.. ఎక్కడ?

ఆదివారం, 18 జూన్ 2023 (15:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ ఓ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం మండిపోతున్న ఎండల ప్రభావం మరో రెండు రోజుల పాటు ఉంటుందని, ఆ తర్వాత విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినప్పటికీ ఎండలు మాత్రం మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా వేసవి ఎండలు జూన్ మూడో వారం వరకు కొనసాగాయి. అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికి కారణం నైరుతి రుతుపవనాలు నిర్ణీత కాలంలో ప్రవేశించి, విస్తరించకపోవడమేనని వాతావరణ  శాఖ హెచ్చరించింది. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయని, దీంతో వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ నెల 19వ తేదీ నుంచి తిరుపతి, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఇంకొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
ముఖ్యంగా, కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వివరించారు. శని, ఆదివారాల్లో మాత్రం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. పలు చోట్ల ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల మేరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు