పురపాలక, జడ్పీటీసీ ఎన్నికలకు జగన్ సర్కారు సమ్మతం!

శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (12:05 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వాయిదా వేసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక సంఘాల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం లిఖిత పూర్వక అంగీకారం తెలిపింది. దీంతో త్వరలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. త్వరలో మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ జారీ చేసే అవకాశముంది. ఆగిన చోట నుంచే మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ కొనసాగించే అవకాశముంది.
 
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేయాలని, మళ్లీ నోటిఫికేషన్‌ ప్రకటించాలని గతంలోనే మెజార్టీ విపక్షాలు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను కోరాయి. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణుల సూచనల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. 
 
కాగా, గురువారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ని కలిసి తొలి దశ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయడంపైనా, మిగతా మూడు దశల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. సాయంత్రం మళ్లీ సీఎస్‌ ఒక్కరే ఎస్‌ఈసీతో భేటీ అయినపుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఈ సందర్భంగా సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్ వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సమ్మతించడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు