ఏపీ - తెలంగాణాల్లో మోగిన ఎమ్మెల్సీ నగారా!

గురువారం, 11 ఫిబ్రవరి 2021 (15:13 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 29తో గడువు పూర్తి కాబోతోంది. 
 
దీంతో ఆయా రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్‌ను గురువారం విడుదల చేసింది. ఆ స్థానాలకు మార్చి 14వ తేదీన ఎన్నికలు నిర్వహించి, 17వ తేదీన ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొంది. మార్చి 22 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. 
 
తెలంగాణలో మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల స్థానంలో ప్రస్తుతం బీజేపీ నేత రామచంద్రరావు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. వరంగల్ - ఖమ్మం - నల్గొండకు టీఆర్‌ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. 
 
అలాగే, ఏపీలో తూర్పు - పశ్చిమ గోదావరి నియోజకవర్గం నుంచి రాము సూర్యారావు, కృష్ణా - గుంటూరు నియోజకవర్గం నుంచి ఎ.ఎస్. రామకృష్ణలు ఎమ్మెల్సీలుగా ఉన్నారు.
 
కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇలా వుంది.. 
 
* ఎన్నికల నోటిఫికేషన్– ఫిబ్రవరి 16 (మంగళవారం)
* నామినేషన్లకు గడువు– ఫిబ్రవరి 23 (మంగళవారం)
* నామినేషన్ల పరిశీలన– ఫిబ్రవరి 24 (బుధవారం)
* నామినేషన్ల ఉపసంహరణకు గడువు– ఫిబ్రవరి 26 (శుక్రవారం)
* పోలింగ్ తేదీ, సమయం – మార్చి 14 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు (ఆదివారం)
* ఓట్ల లెక్కింపు, ఫలితాలు– మార్చి 17 (బుధవారం)

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు