మాజీ మంత్రి కొడాలి నానికి ఊరట - కేబినెట్ హోదాలో..

ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (18:17 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. పాత మంత్రివర్గ సహచరులతో ఆయన రాజీనామా చేయించి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 25 మంత్రులతో ఆయన ఏపీ కేబినెట్‌ను ఏర్పాటు చేయనున్నారు. 
 
ఈ కొత్త మంత్రివర్గం పేర్లను ఆదివారం సాయంత్రం ప్రకటించారు. ఇందులో పరువురు మంత్రిపదవులను నిలుపుకోగా, మరికొందరికి నిరాశ తప్పలేదు. మంత్రి పదవిని కోల్పోయిన వారిలో బూతుల మంత్రిగా పేరుగాంచిన కొడాలి నాని కూడా ఉన్నారు. అయితే, కొడాలి నానికి ప్రభుత్వం కీలక పదవిని అప్పగించింది. 
 
ఏపీ రాష్ట్ర అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌గా నియమించి కేబినెట్ హోదాను కల్పించింది. నిజానికి ఇప్పటివరకు రాష్ట్రంలో ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ బోర్డు లేదు. ఇకపై ఏర్పాటు చేసి, దానికి ఛైర్మన్‌గా కొడాలి నానికి బాధ్యతలు అప్పగించనున్నారు. అలాగే, ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా మల్లాది విష్ణు పేరు ఖరారైంది. 
 
సీఎం జగన్ 2.0  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త మంత్రి మండలిని ప్రభుత్వం ఆదివారం అధికారికంగా వెల్లడించింది. పాత, కొత్త కలయికతో మొత్తం 25 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వీరిలో నగరి ఎమ్మెల్యే ఆర్కే. రోజాకు లక్కీ ఛాన్స్ దక్కింది. 2024లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ కూర్పును సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 
 
ఇప్పటికే నూతన మంత్రుల జాబితా గవర్నర్ వద్దకు వెళ్లింది. సీఎం పేషీ నుంచి కొత్త మంత్రులకు ఫోన్‌లు వెళ్లాయి. ఫోన్‌ రావడంతో ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ విజయవాడ బయల్దేరారు. కొత్త, పాత మంత్రులకు సీఎం పేషీ నుంచి ఫోన్‌లు వెళ్లాయి. మరికొందరికి జీఏడీ నుంచి ఫోన్‌లు వచ్చాయి. సోమవారం ప్రమాణస్వీకారానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. 
 
కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నవారిలో శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ, రాజన్నదొరలకు చోటు కల్పించారు. 
 
అలాగే, విశాఖపట్టణం నుంచి గుడివాడ అమర్నాథ్‌, ముత్యాలనాయుడు, తూర్పుగోదావరి నుంచి దాడిశెట్టిరాజా, విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పశ్చిమ గోదావరి నుంచి తానేటి వనిత, కారుమూరి నాగేశ్వర రావు, కొట్టు సత్యనారాయణలకు చోటు కల్పించారు. 
 
పాత మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామిని మళ్లీ చోటు కల్పించారు. అలాగే, ఆర్కే. రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడుదల రజనీ, కాకాని గోవర్థన్ రెడ్డి, అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఉషా శ్రీ చరణ్, తిప్పేస్వామిలకు చోటు కల్పించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు