పత్తిపాడులో వరుపుల రాజా ఇకలేరు.. గుండెపోటుతో హఠాన్మరణం..

ఆదివారం, 5 మార్చి 2023 (09:28 IST)
కాకినాడ జిల్లా పత్తిపాపుడులో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత వరుపుల రాజా హఠాన్మరణం చెందారు. ఆయనకు గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఆయనకు వయసు 47 సంవత్సరాలు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఆయనకు గుండెల్లో నొప్పిగా ఉండటంతో కాకినాడలోని సూర్యగ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి స్థానికంగా ఉండే అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు.
 
రాజాకు గతంలో ఓ సారి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనకు స్టంట్ వేశారు. అప్పటి నుంచి ఆయన క్రమం తప్పకుండా చికిత్స చేయించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌గా కూడా ఉన్నారు. పైగా, గత కొన్ని రోజులుగా ఆయన ఏమాత్రం విశ్రాంతి లేకుండా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ బిజీగా ఉన్నారు. 
 
శనివారం సాయంత్రం తన స్వగ్రామానికి చేరుకున్న ఆయనకు రాత్రి 8.30 గంటల సమయంలో ఇంట్లోనే పార్టీ నేతలు, కుటుంబ సభ్యులతో మాట్లాడుతుండగా, హఠాత్తుగా గుండెపోటుకు గురై అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే ఆయన్ను హుటాహుటిన సిటీ గ్లోబల్, ఆ తర్వాత అపోలో ఆస్పత్రులకు తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పరుపుల రాజా మృతితో టీడీపీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి విషయం తెలిసుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రాజా మృతి పార్టీకి తీరని లోటుగా ఆయన పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు