పొదుపు పేరుతో మహిళలను మోసం చేసిన ముఠా

మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (12:32 IST)
ఏపీలోని చిత్తూరు జిల్లాలో మహిళలను మోసం చేసే ముఠా ఒకటి వెలుగులోకి వచ్చింది. అనేక మంది మహిళల వద్ద ఈ ముఠా రుణాల పేరుతో బురిడీ కొట్టించి మోసం చేసింది. బ్యాంక్ ఖాతాలు తెరిచి లోన్లు ఇస్తామని చెప్పి.. పొదుపు పేరుతో డబ్బులు నొక్కేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. చిత్తూరు జిల్లాలో అలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాకు చెందిన సెంథిల్, కుమార్, రాజ్ కుమార్, సంగీత అనేవారు ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముఠా మహిళల ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకున్నారు. స్వయం సహాయక సంఘాలకు సహాయం పేరుతో మోసాలకు తెరతీశారు. చిత్తూరు జిల్లాలోని తమిళనాడు సరిహద్దు గ్రామాలనే తమ లక్ష్యంగా ఎంచుకున్నారు. 
 
తమ ప్రధాన కార్యాలయం పట్టణంలోనే ఉన్నట్లు తప్పుడు చిరునామాతో బురిడీ కొట్టించారు. జిల్లాలోని శ్రీకాళహస్తి, సత్యవేడు, బి.ఎన్ కండ్రిగ, ప్రాంతాలకు చెందిన పేదలకు ఆర్థిక సహాయం పేరుతో వడ్డీ లేకుండా ఒక్కో గ్రూపుకు 50 వేల రూపాయల చొప్పున రుణాలు మంజూరు చేస్తామని నమ్మబలికారు. ఇందుకోసం విస్తృతంగా కరపతార్లు కూడా పంపిణీ చేశారు. 
 
ఈ ముఠా ప్రచారాన్ని నమ్మిన మహిళలు ప్రాసెసింగ్ ఫీజు కింద ఒక గ్రూప్ నుండి 10 నుంచి 15 వేల రూపాయలు వసూలు చేశారు. బాధితుల నుంచి ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్ రూపేణా పెద్ద మొత్తంలో వసూళ్ల దందాకు తెరదీశారు. సంగీత, రాజ్ కుమార్ పేర్లతో ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయించున్నారు. 
 
అయితే, కొందరు మహిళలు తమ అవసరాలకు రుణాలు ఇవ్వాలని కోరడంతో ఈ ముఠా బండారం బయటపడింది. ఇవాళ, రేపు అంటూ దాటవస్తూ రావడంతో.. అనుమానం వచ్చి ఫోన్ చేయడంతో సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు నిర్వహకులు. దీంతో తాము మోసపోయామని భావించిన బాధితులు న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ మెట్టెక్కారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు