దుష్ట శిక్షణ - శిక్షణ రక్షణ కోసమే ఏపీలో పొత్తులు : దగ్గుబాటి పురంధేశ్వరి

ఠాగూర్

ఆదివారం, 10 మార్చి 2024 (15:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు కుదిరింది. దీనిపై ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. ఏపీలో టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తు ఏర్పడటం శుభపరిణామం అని, సంతోషదాయకం అని చెప్పారు. దుష్ట శిక్షణ - శిష్ట రక్షణ కోసమే ఏపీలో పొత్తులు పెట్టుకున్నామని తెలిపారు. నాడు దుష్ట శిక్షణ, శిష్ణ రక్షణ కోసం శ్రీరాముడు, హనుమంతుడు, జాంబవంతుడు, విభీషణుడు, ఉడత సాయం కూడా తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఇవాళ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి నెలకొనివుందని వ్యాఖ్యానించారు. ఈ మూడు పార్టీల మధ్య పొత్తు ఏర్పడటం శుభపరిణామం, సంతోషదాయకం అని ఆమె పేర్కొన్నారు. 
 
"మేం ఢిల్లీ వెళ్లి ఏపీలోని పరిస్థితిపై మా నాయకత్వానికి తెలియజేశాం. అనంతరం టీడీపీ, జనసేన పార్టీల అగ్రనేతలతో మా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, మా పార్టీ అగ్రనేత అమిత్ షా సమాలోచనలు చేశారు. సంతోషం కలిగించే విషయం ఏంటంటే.. ఏ పొత్తు గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఆ పొత్తు ఖరారైంది. ఎన్ని సీట్లు, ఎవరికి ఏ సీటు అనేది ఇవాళో రేపో ఖరారు అవుతుంది. సీట్ల పంపకంపై సోమవారం సాయంత్రం లేదా మంగళవారం లోపల మీడియాకు తెలియజేస్తాం. పొత్తుల గురించి అర్థం చేసుకోగలిగిన సామర్థ్యం మా కార్యకర్తలకు ఉంది. రాష్ట్ర హితం కోరి పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా అందుకు కట్టుబడి ఉంటారు" అని పురంధేశ్వరి వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు