అహింసా మార్గంలో ప‌వ‌న్ ఉద్య‌మిస్తుంటే... ప్రజా గొంతుకను నొక్కేస్తారా?

శనివారం, 2 అక్టోబరు 2021 (13:04 IST)
రాజ‌మండ్రిలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ ప్ర‌జా ఉద్య‌మాన్ని అడ్డుకుంటున్నార‌ని బీజేపీ మండిప‌డుతోంది. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్యం  తెచ్చిన పూజ్య బాపూజీ జయంతి రోజున వైసిపి ప్రభుత్వం ప్రజాగొంతుకలను నొక్కేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.
 
రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ప్రజాసమస్యలను గాలికొదిలేసిన క్రమంలో ఉద్యమాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తుంటే, వాటిని   పరిష్కరించాల్సిన వైసీపీ ప్రభుత్వం, అందుకు విరుద్ధంగా, ప్రతిపక్షాలను అణిచివేతకు గురిచెయ్యడం దేనికి సంకేతం అని సోము వీర్రాజు ప్రశ్నించారు. తమ మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాష్ట్రంలోని రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయని,  గాంధీజీ విధానంలో  ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, జనసేన, బీజేపీ నేతలను ముందస్తు  హౌస్ అరెస్టులు చేశార‌ని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని సోము వీర్రాజు చెప్పారు. 
 
జనసేన ఉద్యమానికి బిజెపి సంపూర్ణ మద్దతు పలుకుతోందని, ఉభయ గోదావరి జిల్లాల్లో  బిజెపి, జనసేన నాయకులను హౌస్ అరెస్టు చేయడాన్నిబిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు తీవ్రంగా ఖండిస్తూ, పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డంపెట్టి పాలన సాగించాలని యత్నిస్తోందని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టంటూ ఒక ప్రకటన విడుదల చేసారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు