మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వండి : చంద్రబాబు లాయర్లు

మంగళవారం, 31 అక్టోబరు 2023 (13:45 IST)
మద్యం కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై ఏసీబీ కోర్టు విచారణ జరుపనుంది. మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు ఆయన ఈ మధ్యంతర బెయిల్ వర్తిస్తుంది. ఆ తర్వాత నవంబరు 28వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు రాజమండ్రి జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలి హైకోర్టు షరతు విధించింది. 
 
అలాగే, ఈ కేసు గురించి లేదా కేసును ప్రభావితం చేసే విధంగా నడుచుకోరాదని స్పష్టం చేసింది. అలాగే లక్ష రూపాయల పూచీకత్తుపై రెండు ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఇద్దరు టీడీపీ నేతలు ష్యూరిటీ ఇవ్వడంతో చంద్రబాబు మంగళవారం సాయంత్రం 4 గంటలకు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, స్కిల్ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందని ఏపీ ప్రభుత్వం ముందుగానే భావించి ఆయన్ను ఇబ్బంది పెట్టేందుకు మరో కేసును సిద్ధం చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమలు ఇచ్చారంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయనను ఏ3గా చేర్చి, ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 
 
ఏపీ సీఐడీ నమోదు చేసిన ఈ మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. కాగా, ప్రభుత్వం మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చిందని సీఐడీ ఆరోపిస్తుంది. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద మాజీ సీఎం చంద్రబాబుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు