తెలుగోళ్ళ తెలివితేటలు అమెరికన్లకు ఎక్కడివి... అందుకే దాడులు : చంద్రబాబు

సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (19:32 IST)
తెలుగు ప్రజలకున్న తెలివితేటలు అమెరికన్లకు లేవని, వారి తెలివితేటలను చూసి ఓర్వలేని అమెరికన్లు... అసూయతోనే యుఎస్‌లో ఉన్న తెలుగు విద్యార్థులు, ఇంజనీర్లపై దాడులు జరుగుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. అమెరికాలోని కన్సాస్‌లో తెలుగు ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్లను అమెరికా పౌరుడు కాల్చి చంపిన విషయం తెల్సిందే. 
 
దీనిపై సోమవారం గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... మన తెలివి తేటలు చూసి తట్టుకోలేకనే అమెరికాలో మన వాళ్ల పైన దాడులు చేస్తున్నారన్నారు. అమెరికాలో మన వాళ్లపైన దాడులు చాలా బాధాకరమన్నారు. దాడులను అమెరికా వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. భారతీయులపై దాడులు జరగకుండా ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. 
 
''అమెరికాలో తెలుగువారిపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయంటే దీనికి కారణం మన తెలివే మన మీద ఆసూయగా వచ్చే పరిస్థితి వస్తోందని'' అన్నారు. తెలుగువాళ్లు అమెరికావెళ్లి బాగా కష్టపడి, తెలివితేటలతో ఆ దేశం అభివృద్ధి కోసం కృషి చేశారని, అలాంటి వారిపై దాడులు జరగడం చాలా బాధగా ఉందని చంద్రబాబు అన్నారు. దీన్ని పూర్తిగా నివారించాల్సిన బాధ్యత అమెరికాపై ఉందని, అదే విధంగా ఆ దేశంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత కూడా కేంద్రంపై ఉందని ఆయన అన్నారు. 

వెబ్దునియా పై చదవండి