ఆమె కల్లుగీత కార్మికుని కూతురు... పవర్ లిప్టింగ్‌లో పతకం... రూ.10 లక్షలు ప్రకటించిన చంద్రబాబు

సోమవారం, 17 సెప్టెంబరు 2018 (21:57 IST)
అమరావతి: సౌత్ ఆఫ్రికాలో జరిగిన వరల్డ్ పవర్ లిప్టింగ్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన డొంకెన అనూషకు ముఖ్యమంత్రి    చంద్రబాబు రూ.10 లక్షలు ప్రకటించారు. శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సోమవారం సాయంత్రం అనూష, మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరారావు, కొల్లు రవీంద్ర, తన తల్లిదండ్రులతో కలసి ముఖ్యమంత్రిని కలిసింది. ఈ సందర్భంగా అనూషను ఆయన అభినందించారు.
 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా పది లక్షల రూపాయల పారితోషికం ప్రకటించారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని పొందుగల గ్రామానికి చెందిన అనూష జాతీయస్థాయిలో పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్‌లో సాధించిన అనేక బంగారు, రజతం, కాంశ్య పతకాలను సీఎం చంద్రబాబుకు చూపించింది. ఇన్నాళ్ళూ విరాళాలిచ్చి జాతీయ క్రీడల్లో పాల్గొనేలా దాసరి మధు, యుగంధర్, రాజు ప్రోత్సహించినట్లు అనూష సీఎం చంద్రబాబుకు తెలిపింది.
 
కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధనే లక్ష్యంగా కృషి చేస్తున్నానని చెప్పింది. అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో రాణిస్తున్న అనూష కల్లుగీత కార్మికుడు శ్రీనివాసరావు కుమార్తె అని మంత్రి ఉమా మహేశ్వర రావు సీఎంకు తెలిపారు. కష్టపడి కూతురు అనూషను క్రీడల్లో ప్రోత్సహించారని వివరించారు. అనూషకు అన్ని విధాలా అండగా ఉండి ప్రోత్సహిస్తామని సీఎం చెప్పారు. శాప్‌లో శిక్షణతోపాటు తగిన క్రీడా వసతులు కల్పించాలని శాప్ ఛైర్మన్ అంకమ్మ చౌదరిని ఆదేశించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు