అస్తవ్యస్త విద్యుత్ కొనుగోళ్ల విధానంతో రూ.12,250 కోట్ల అదనపు భారం : సీఎం చంద్రబాబు

వరుణ్

శుక్రవారం, 26 జులై 2024 (16:33 IST)
గత వైకాపా పాలకులు అనుసరించిన అస్తవ్యస్త విద్యుత్ కొనుగోళ్ల విధానంతో రూ.12250 కోట్ల మేరకు అదనపు భారం పడిందని టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆయన శుక్రవారం అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 2014 నుంచి 2019 వరకు తాము అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిలబెట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశామన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి పోలవరం జీవనాడిలా చేశామన్నారు. పోలవరం పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు నీరందుతుంది. ఏపీకి సుదీర్ఘ తీరప్రాంతం ఉండటం కలిసొచ్చే అంశం. అభివృద్ధి చేస్తే ఏపీ కూడా తెలంగాణతో సమానంగా ముందుకెళుతుంది. రూ.1167 కోట్లు ఖర్చు చేసి పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేశాం. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేయడం వల్ల రూ.44 వేల కోట్ల ఆదాయం చేకూరిందన్నారు. 
 
విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప ఎయిర్ పోర్టులు అభివృద్ధి చేశాం. కాకినాడ సెజ్ కు 8 వేల ఎకరాల భూమి సేకరిస్తే, గత ప్రభుత్వ హయాంలో అంతా మార్చేశారు. రాష్ట్రంలో 8 లక్షల మందికి పైగా నైపుణ్య శిక్షణ ఇచ్చాం. కానీ, 2019 తర్వాత తప్పుడు పాలనతో పరిస్థితి తారుమారైంది. అస్తవ్యస్త విద్యుత్ కొనుగోళ్ల విధానం ద్వారా రూ.12,250 కోట్ల మేర అదనపు భారం పడింది. అక్రమ ఇసుక తవ్వకాలతో రూ.7 వేల కోట్ల నష్టం వాటిల్లింది. రూ.9,750 కోట్ల మేర ఖనిజ సంపదను దోచుకున్నారు. 
 
మడ అడవులను 101.16 ఎకరాల్లో ధ్వంసం చేస్తే, ఎన్జీటీ రూ.5 కోట్ల జరిమానా వేసింది. పెట్టుబడిదారుల విశ్వాసం కోల్పోగా... అమరావతి, పోలవరం, శక్తి ఉత్పాదన రంగంలో కాంట్రాక్టులు రద్దయ్యాయి. ప్రభుత్వ అసమర్థత కారణంగా ఒక్క విద్యుత్ రంగంలోనే 1.29 లక్షల కోట్ల నష్టం వచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆయకట్టు నిర్ధారణలో జాప్యం కారణంగా రూ.45 వేల కోట్లు, డ్యామేజీలు, మరమ్మతులతో మరో రూ.4,900 కోట్లు, జల విద్యుత్ ఉత్పాదనలో జాప్యం కారణంగా రూ.3 వేల కోట్లు నష్టం వాటిల్లింద అని ఆయన సభకు వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు