విన్న‌పాలు, వేడుకోలు... కొలిక్కి రాని పి.ఆర్.సి...చూస్తాన‌న్న సీఎం

గురువారం, 6 జనవరి 2022 (16:37 IST)
ఏపీ సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సీయం జగన్ తో పీఆర్సీ పై ఉద్యోగ సంఘాల సమావేశం ముగిసింది. ఇప్పటికే వస్తున్న 27 శాతం ఐ.ఆర్. తగ్గకుండా ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగులు ప‌ట్టుబ‌ట్టారు. 34 శాతం పీఆర్సీ ఇవ్వాల‌ని సచివాలయ ఉద్యోగుల సంఘం కోరింది. ఇది ఆర్థికంగా పెనుభారం అని సీఎం జ‌గ‌న్ సెల‌విచ్చారు. చేతనైనంత వరకూ మంచి పీఆర్సీ ఇస్తానని ముఖ్యమంత్రి ముగించారు.

 
ఉద్యోగ సంఘాలతో సమావేశంలో చర్చించిన అంశాలను రెండు, మూడు రోజుల్లో కొలిక్కి తెస్తామ‌ని సీఎం జగన్‌ మీడియాకు వెల్లడించారు. ‘‘ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్‌ చేసుకున్నా. అన్ని సమస్యలు సరిదిద్దేందుకు చర్యలు చేపడతాం. ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరుతున్నా. ప్రభుత్వం మోయలేని విధంగా భారం ఉండకూడదు. సానుకూల దృక్పథంతో ఉండాలని కోరుతున్నా. ఎంత మంచి చేయగలిగితే అంత చేస్తా. మంచి చేయాలన్న తపనతో ఉన్నాం. రెండు,మూడు రోజుల్లో ప్రకటన విడుదల చేస్తాం’’ అని జగన్‌ తెలిపారు.
 
 
అయితే, ఈ భేటీలో సీఎం జగన్ రాష్ట్ర  ఆర్ధిక పరిస్థితిని ఉద్యోగ సంఘాలకు  వివరించార‌ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్య నారాయణ తెలిపారు. తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర  విభజన నుంచి కరోనా వరకు నెలకొన్న ఇబ్బందులు అన్నింటినీ  అధికారులు వివరించార‌ని తెలిపారు.


2010లో 27 శాతం ఫిట్మెంట్ అని  పీఆర్సీ రిపోర్ట్ ఇస్తే 39  శాతం ఇచ్చార‌ని, ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్ళామ‌ని పేర్కొన్నారు. కాంటాక్ట్, ఔట్ సోర్సింగ్  ఉద్యోగులను కూడా దృష్టి లో పెట్టుకోవాలని సీఎంను కోరినట్లు తెలిపారు. అలాగే పక్క రాష్ట్రం కన్నాఎక్కువ  బెనిఫిట్ ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఆర్ధిక శాఖా అధికారులతో చర్చించి రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పినట్లు వివరించారు. మరో రెండు మూడు రోజుల్లో పీఆర్సీపై ప్రకటన ఉండచ్చుఅని ఆయన వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు