ఐదుగురు ఎమ్మెల్యేలని లాక్కుంటే బాబు హోదా పోతుంది... సీఎం జగన్

గురువారం, 13 జూన్ 2019 (13:51 IST)
ఏపీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ... గత అసెంబ్లీలో తమ పార్టీ నుంచి 67 మంది విజయం సాధిస్తే వారిలో 23 మందిని తెలుగుదేశం పార్టీ చేర్చుకున్నదని అన్నారు. తాము మాత్రం అలా చేయబోమని చెప్పుకొచ్చారు. ఒకవేళ టీడీపీ నుండి తమ పార్టీలో ఎవరినైనా చేర్చుకుంటే తెదేపా ద్వారా పొందిన పదవులకు రాజీనామాలు చేసిన తర్వాతే తమ పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. 
 
అలా కాకుండా తాము పార్టీ మారకుండా చేర్చుకుంటే అనర్హత వేటు వేయాలని స్పీకర్ తమ్మినేనికి తేల్చి చెప్పారు జగన్ మోహన్ రెడ్డి. తను కూడా చంద్రబాబు నాయుడిలా ఆలోచన చేసి తెదేపా నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలను లాక్కుంటే ఆయన ప్రతిపక్ష హోదా కూడా పోతుందన్నారు. కానీ తాము కూడా అలా చేస్తే చంద్రబాబు నాయుడికి తనకు తేడా ఏముంటుందని ప్రశ్నించారు. 
 
విలువలతో కూడిన రాజకీయాలు వుంటాయని అన్నారు. గతంలో తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న తెదేపాకి ఈసారి 23 మంది ఎమ్మెల్యేలే మిగిలారనీ, అది కూడా మే 23వ తేదీన ఈ ఫలితాలు వచ్చాయన్నారు. దేవుడు స్క్రిప్టు రాస్తే ఎలా వుంటుందో ఈ ఫలితాలతో రుజువయ్యాయన్నారు. తమ పార్టీ నుంచి వెళ్లినవారిపై అనర్హత వేటు వేయాలని ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదనీ, అందుకే ప్రజలే తెలుగుదేశం పార్టీపై అనర్హత వేటు వేశారని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు