సున్నావడ్డీ పథకం ప్రారంభం కోసం 22న ఒంగోలుకు సీఎం జగన్

గురువారం, 21 ఏప్రియల్ 2022 (17:29 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరుస పర్యటనకు శ్రీకారం చుట్టారు. మరో రెండేళ్ళలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆయన మళ్లీ ప్రజల మధ్యలోకి వెళ్లేందుకు వరుసగా జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా, శుక్రవారం ఒంగోలు జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో ఆయన వైఎస్ఆర్ సున్నావడ్డి పథకం మూడో విడత పథకాన్ని ప్రారంభిస్తారు. 
 
ఇందుకోసం ఆయన శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానానికి చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ సున్నా వడ్డీ మూడో విడత పథకాన్ని ప్రారంభిస్తారు. 
 
ఈ కార్యక్రమం తర్వాత బందర్ రోడ్డులో ఉన్న రవిప్రియ మాల్ అధినేత రవిశంకర్ నివాసానికి సీఎం జగన్ వెళ్లి, వారి కుటుంబంలో ఇటీవల వివాహమైన నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.45 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. ఈ పర్యటనల్లో ఆయన విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు