కర్ఫ్యూ ఆంక్షల సడలింపుపై ఏపీ సీఎం జగన్ సమీక్ష

సోమవారం, 5 జులై 2021 (10:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కొవిడ్‌పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. 
 
రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఇంకా కొనసాగుతున్న కర్ఫ్యూ ఆంక్షలపై చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 8 నుండి రాత్రి కర్ఫ్యూ మాత్రమే కొనసాగించాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పగటి పూట కర్ఫ్యూ అమలులో ఉన్న జిల్లాల్లో కూడా పాజిటివిటీ రేటు తగ్గుతుండడంతో సడలింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు, ఏపీలో ఆదివారం నాటి బులిటెన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 94,595 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,175 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 662 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 59 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 3,692 మంది కరోనా నుంచి కోలుకోగా, 29 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరులో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు మరణించారు.
 
రాష్ట్రంలో ఇప్పటివరకు 19,02,923 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 18,54,754 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 35,325 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 12,844కి పెరిగింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు