పెన్షన్లు వలంటీర్లు ఇవ్వొద్దన్న ఈసీ ఆదేశాలపై హైకోర్టు తీర్పేంటి?

ఠాగూర్

బుధవారం, 3 ఏప్రియల్ 2024 (15:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపాకు కార్యకర్తల్లా పని చేసే వలంటీర్ల ద్వారా అర్హులైన వారికి పింఛన్లు పంపిణీ చేయరాదన్న ఎన్నికల సంఘం ఆదేశాలను ఏపీ హైకోర్టు సమర్థించింది. ఈసీ ఆదేశాలను గుంటూరుకు చెందిన ఓ మహిళ సవాల్ చేసింది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు... ఈసీ ఆదేశాలను సమర్థించింది. దీంత పింఛన్ల పంపిణీలో వలంటీర్లు పాల్గొనకుండా ఈసీ జారీ చేసిన ఆదేశాలు పక్కాగా అమలుకానున్నాయి. 
 
ఏపీలోని సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల నేపథ్యంలో అన్ని రకాల ఎన్నికల విధులకు వాలంటీర్లను ఎన్నికల సంఘం దూరంగా ఉంచింది. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనరాదని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. పెన్షన్లను కూడా వాలంటీర్లు ఇవ్వడానికి వీల్లేదని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వాలంటీర్లు పింఛన్లు ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గుంటూరుకు చెందిన ఓ మహిళ ఈ పిటిషన్‌ను వేశారు. వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడతారని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. 
 
వాలంటీర్ల విషయంలో ఎన్నికల సంఘం చర్యలను హైకోర్టు సమర్థించింది. పెన్షన్లు వేరే మార్గాల్లో అందించాలంటూ కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీచేశారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు ఆలకించిన హైకోర్టు... ఆ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు తెలిపింది. మరోవైపు, పింఛన్‌దారులకు సచివాలయాల వద్ద పంఛన్లు పంపిణీ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు