తిరుపతి భూములను వైకాపా నేతలు కబ్జా చేశారు : మంత్రి ఆనం రామనారాయణ

ఠాగూర్

ఆదివారం, 11 ఆగస్టు 2024 (10:59 IST)
తిరుపతి భూములను వైకాపా నేతలు కబ్జా చేశారని ఏపీ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బ్లాక్‌-2లోని తన ఛాంబర్‌లో పూజలు చేశారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలిచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం దేవాదాయ శాఖకు సంబంధించిన పలు దస్త్రాలను ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. 
 
గత ప్రభుత్వంలో తిరుమల నుంచి అరసవల్లి వరకు భూములు అన్యాక్రాంతం అయ్యాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజాగళం, యువగళంలో వచ్చిన వినతులను పరిష్కరిస్తామని తెలిపారు. 
 
ఎన్నికల హామీల మేరకు రూ.50 వేలకు తక్కువ ఆదాయం ఉన్న దేవస్థానాలకు ధూపదీప నైవేద్యాలకు రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనికి సంబంధించి దేవాదాయ శాఖపై రూ.32 కోట్లు అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు. 
 
తప్పులు చేసిన వారిని వదిలేది లేదని మంత్రి హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలో రెండు ఆలయాల్లో తప్పులు జరిగినట్లు నిర్ధరించి ఐదుగురు అధికారులను సస్పెండ్ చేశామన్నారు. వారిపై పూర్తి విచారణ జరుగుతోందని వివరించారు. కొన్ని దేవాలయాలను పునర్నిర్మించడానికి నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశంతో కృష్ణ, గోదావరి సంగమం వద్ద జలహారతి తిరిగి కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు