'గాలి' కళ్యాణ్ విమర్శలను పట్టించుకోం: ఏపీ మంత్రి జవహర్ సంచలనం

సోమవారం, 13 ఆగస్టు 2018 (21:46 IST)
అమరావతి : రాష్ట్రంలో బెల్టు షాపులు,నాటుసారా తయారీ, గంజాయి సాగు నివారణే ఫ్రభుత్వ లక్ష్యమని అందుకనుగుణంగా పటిష్టమైనచర్యలు తీసుకోవడం జరుగుతోందని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖామాత్యులు కె.ఎస్.జవహర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం అమరావతి సచివాలయంలోని నాల్గవ బ్లాకు పబ్లిసిటీ సెల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బెల్టు షాపులు నివారణ, నాటుసారా తయారీ, గంజాయి సాగును పూర్తిగా నివారించేందుకు ప్రజల్లో పెద్దఎత్తున అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 9 జిల్లాల్లో ఈవిధంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని మిగతా నాలుగు జిల్లాల్లోను ఈకార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని పేర్కొన్నారు. 
 
మద్యం విక్రయాలు ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రధాన ఆదాయవనరుగా ప్రభుత్వం భావించడం లేదని ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.నాణ్యతతో కూడిన మద్యాన్ని విక్రయించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. హోలోగ్రాము నెట్ వర్కు సమస్య వచ్చిందని దానిని పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.గంజాయి సాగును పూర్తిగా అదుపు చేసేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నామని మంత్రి జవహర్ స్పష్టం చేశారు.
 
అంతకుముందు రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ జగన్ అక్రమాస్తుల కేసు విషయంలో ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఇడి)జగన్ సతీమణి వైఎస్.భారతి పేరును ముద్దాయిగా చేర్చడంపై ముఖ్యమంత్రికి ఏమి సంబంధం ఉందని అనవసరంగా ఆ పార్టీ నేత రోజా సియంని విమర్శించడం సరికాదని వెంటనే ఆమె వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండు చేశారు. దేవతలెవరో రాక్షసులెవరో ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొంటూ రోజా ఐరెన్ లెగ్‌గా ఉండి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పరాజయం పాలు కావడం జరుగుతోందని ఆయన వ్యాఖ్యాణించారు. జగన్ కేసులు త్వరగా విచారణ పూర్తి కాకుండా అడ్డుపడుతున్నది ఆయనేనని, అంతేగాక ఆయన సతీమణి భారతికి షేర్లు ఇప్పించి కుటుంబ సభ్యులను బయటికి లాగిందీ ఆయనేనని విమర్శించారు.
 
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది తెలుగుదేశం పార్టీ అని, మోదీ, అమిత్ షా జోడీని ధైర్యంగా వ్యతిరేకించిన నాయకుడు చంద్రబాబు నాయుడని మంత్రి జవహర్ పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తావనకు రాగా పవన్ అంటే గాలి అని... గాలి కళ్యాణ్ చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని మంత్రి జవహర్ వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు