కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి చెందిన ప్రజలు 30 యేళ్ల తర్వాత స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాలకు వచ్చిన తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం చేపట్టారు. ఈ ఫలితాల్లో అధికార టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ముఖ్యంగా, పులివెందులలో పోటీ చేసిన వైకాపా అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ ఫలితంపై నారా లోకేశ్ స్పందించారు.
దాదాపు 30 యేళ్ల తర్వాత పులివెందులలో తొలిసారిగా నిజమైన ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరిగాయని, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఇది ఎంతో కష్టపడి సాధించిన విజయమని ఆయన అభినందించారు. పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు తిరోగమనాన్ని కాదని, పురోగతికి పట్టం కట్టారన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థుల విజయం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుందన్నారు.
స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన మారెడ్డి లతారెడ్డి, ముద్దుకృష్ణా రెడ్డిలకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓట్లు వేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజల మద్దతుతోనే ఈ విజయం సాధ్యమైందని నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు.
పులివెందులకు పూర్వవైభవం వచ్చింది : ఎమ్మెల్యే బాలకృష్ణ
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కడప జిల్లా పులివెందులకు పూర్వవైభవం వచ్చిందని సినీ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. గతంలో ఆయన పులివెందులలో ఎన్నికలు అప్రజాస్వామయ్య బద్ధంగా జరిగాయని, ఇపుడు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయన్నారు. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. ఈ ఫలితాలపై నందమూరి బాలకృష్ణ పై విధంగా స్పందించారు.
పులివెందులకు పూర్వవైభవం వచ్చిందన్నారు. ప్రజలు భయం లేకుండా ధైర్యంగా ముందుకు వచ్చిన తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. గతంలో నామినేషన్ వేయడానికే భయపడేవారని, ఇపుడు మాత్రం స్వేచ్ఛగా వచ్చి నామినేషన్లు దాఖలు చేశారని ఆయన గుర్తుచేశారు.
మూడు దశాబ్దాల తర్వాత ఓటు వేశా : బ్యాలెట్ బాక్సులో ఓటరు సందేశం
కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరిగింది. ఇందులో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 25వ ఓట్లను ఒక కట్టగా కట్టేటపుడు అందులో నుంచి ఓ స్లిప్ బయపటపడింది. ఓ అజ్ఞాత వ్యక్తి దాన్ని రాసి బ్యాలెట్ బాక్స్లో వేశాడు. అందులో 30 యేళ్ల తర్వాత ఓటు వేసినందుకు చాలా సంతోషంగా ఉందని సదరు ఓటరు అందులో పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాలుగా పులివెందులలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ స్థానికులు మాత్రం తమ ఓటు హక్కును ఎన్నడూ ఉపయోగించుకున్న దాఖలాలు లేదు.
ప్రజలను పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకుని ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులో రిగ్గింగ్కు పాల్పడుతూ ఓటు హక్కును వినియోగించుకునేవారు. ఇలా కొన్నేళ్లుగా సాగుతోంది. ఇపుడు రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. దీంతో పులివెందుల ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకున్నారు.