ఆయనో అద్దె మైకు.. క్యాల్షీటుకు న్యాయం చేసిన పవన్ నాయుడు : మంత్రి పేర్ని నాని

ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (16:25 IST)
జనసేనాని పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. పవన్ నాయుడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శనివారం తిరుపతిలో పవన్ కళ్యాణ్ పాల్గొన్న బీజేపీ-జనసేన ప్రచార సభపై పేర్ని నాని స్పందించారు. 
 
టీడీపీ, బీజేపీ ప్రాయోజిత కార్యక్రమాన్ని పవన్ రక్తి కట్టించాడని, తన కాల్షీట్‌కు న్యాయం చేశాడని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ఓ అద్దె మైకులా తయారయ్యారని విమర్శించారు.
 
ఉత్తరాది బీజేపీ దక్షిణాదికి అన్యాయం చేస్తోందని నాడు విమర్శించిన పవన్ కల్యాణ్... నేడు అదే బీజేపీకి మద్దతు ఇవ్వాలని అంటున్నారని మండిపడ్డారు. 
 
2014లో కాంగ్రెస్‌ను పారదోలాలని పిలుపునిచ్చావ్... 2019లో బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలంటే చిన్న చూపు అన్నావ్... పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందన్నావ్.. ఇప్పుడేంటి రంకెలేస్తున్నావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
వివేకా హత్య కేసుపై మాట్లాడుతున్న పవన్ కల్యాణ్‌కు అసలు ఆ కేసు విచారణ ఏ దశలో ఉందా తెలుసా? అని ప్రశ్నించారు. సీబీఐ నేరుగా కేంద్ర హోంమంత్రి అధీనంలో పనిచేస్తుందన్న విషయం తెలియదా? అని అన్నారు. పవన్ అజ్ఞాతవాసే అనుకున్నాం, కానీ అజ్ఞానవాసి అని ఇప్పుడు తెలుస్తోంది అని విమర్శించారు. 
 
మరోవైపు, వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్య చేశారు. వైసీపీ సమీప ప్రత్యర్థి ఎవరని తెలుసుకునేందుకు మాత్రమే తిరుపతి ఎన్నిక అని స్పష్టం చేశారు. తద్వారా ప్రథమస్థానం తమదేనని, తమ తర్వాత రెండో స్థానంలో నిలిచే పార్టీ ఏదన్న విషయం ఈ ఉప ఎన్నిక ద్వారా తెలుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
కాగా, తిరుపతి ఉప ఎన్నిక బరిలో నామినేషన్ల ఉపసంహరణ పర్వం నిన్నటితో ముగియగా... ఆఖరుకు 28 మంది బరిలో మిగిలారు. ప్రధానంగా వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి, బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ మధ్యే పోటీ ఉండనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు