ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం : మంత్రి ఆళ్ళ నాని

గురువారం, 22 ఏప్రియల్ 2021 (17:05 IST)
కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఏం చర్యలు తీసుకోవాలి, వ్యాప్తి నిరోధానికి చేపట్టాల్సిన చర్యలు, ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంపు, కోవిడ్ కేర్ కేంద్రాలను పెంచటం, రెమెడిసివిర్ ఇంజెక్షన్, ఆక్సిజన్ కొరత లాంటి అన్ని అంశాలు చర్చించినట్టు ఏపీ వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ళ నాని వెల్లడించారు.
 
ఇదే అంశంపై ఆయన గురువారం మాట్లాడుతూ, కోవిడ్ నియంత్రణ కోసం, ప్రజలకు సందేహాలు నివృత్తి, ఫిర్యాదుల స్వీకరణ కోసం 104 కాల్ సెంటర్ బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మందులు, ఆక్సిజన్ కొరత దేశంలో ఉంది. ఏపీలోను ఇబ్బందులు ఉన్నపటికీ దాన్ని ఎదుర్కొనేందుకు కార్యాచరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 
 
సీఎం దగ్గర జరిగే సమీక్షలో ఈ అంశాలను ప్రస్తావించి మెరుగైన చర్యలు చేపడతామన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు మాత్రమే వసూలు చేయాలి, అలా కాకపోతే కఠిన చర్యలు తీసుకోడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. 
 
ప్రజలు మాస్కులు, భౌతిక దూరంలాంటి జాగ్రత్తలు తీసుకుని కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కృషి చేయాలన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు ఇబ్బంది లేదు. 
 
ఆక్సిజన్ ప్లాంట్ పెట్టేందుకు కేంద్రం సహకారం అందిస్తామన్నారు. ఏపీలో 49 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేసినట్టు తెలిపారు. కేంద్రం సరఫరా చేసినంత మేర వ్యాక్సినేషన్ వేయగలుగుతున్నాం. 18 ఏళ్ల పైబడిన వ్యక్తులకు వ్యాక్సినేషన్ వేసే విషయంలో ఇంకా స్పష్టత లేదు. సీఎం దగ్గర చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కరోనా పరీక్షల సామర్ధ్యం పెంచుతామని, ఫలితాలు ఆలస్యం అవుతున్నాయని తెలుస్తోంది. వీటిపై దృష్టి పెడతామని మంత్రి వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు