రూ.120 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించిన ఏపీ ఎన్జీవో

ఠాగూర్

బుధవారం, 4 సెప్టెంబరు 2024 (20:02 IST)
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం ఏపీ ఎన్జీవో వరద బాధితుల సహాయార్థం భారీ విరాళం ప్రకటించింది. తమ ఒకరోజు వేతనాన్ని వారు విరాళంగా ప్రకటించారు. ఏపీ ఎన్జీవో జేఏసీ నేతలు బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలుసుకుని రూ.120 కోట్ల విరాళం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఏపీ ఎన్జీవో నేతలను అభినందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రంగాల వారు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 
 
మరోవైపు, విజయవాడను చిగురుటాకులా వణికించిన బుడమేరుకు మళ్లీ వరద పోటు పెరుగుతుంది. మంగళవారం బుడమేరులో వెయ్యి క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగింది. ఇది బుధవారానికి మరింతగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి 8 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గండి పడిన చోట ప్రస్తుతం బుడమేరు ప్రవాహం 3 అడుగులకు చేరిందని, ఇప్పటికీ ఒక గండి పూడ్చినట్టు తెలిపారు. మిగిలిన రెండు గండ్లను పూడ్చే పనులు జరుగుతున్నాయని, ఈ పనులను మంత్రులు నారా లోకేశ్, నిమ్మల రామానాయుడులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని  తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు