గంజాయి తరలిస్తూ అడ్డంగా బుక్కైన ఏపీ పోలీసులు.. ఎక్కడ?

వరుణ్

శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (13:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు సాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిని నిజం చేసేలా ఏపీ పోలీసులు కూడా గంజాయి అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో కారులో గంజాయి తరలిస్తూ ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు అరెస్టు అయ్యారు. వీరిద్దరూ విధులకు సెలవు పెట్టి గంజాయి తరలిస్తూ పోలీసులకు చిక్కారు. 
 
శుక్రవారం తెల్లవారుజామున తెలంగాణ పోలీసులు జరిపిన తనిఖీల్లో వీరు చిక్కారు. వీరు ప్రయాణిస్తున్న కారులో 22 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా విధులకు సెలవు పెట్టి మరీ గంజాయి దందాకు ఏపీకి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు తెరలేపారు. ముందస్తు సమచారం అందడంతో తెలంగాణ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. 
 
పోలీసుల సమాచారం మేరకు.. బాచుపల్లిలో గంజాయి అమ్మేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ సమాచారం అందడంతో బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున వాహనాలు తనిఖీ చేపట్టారు. దీంతో ఓ కారులో 22 కేజీల గంజాయి బయటపడింది. ఆ కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించరా, విస్తుపోయే నిజం వెలుగు చూసింది.
 
 వారిద్దరూ ఏపీ పోలీస్ శాఖకు చెందిన వారని, ఒకరు కాకినాడలో హెడ్ పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నట్టు తేలింది. మరొకరు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారని తేలింది. విధులకు సెలవు పెట్టి మరీ వీరిద్దరూ గంజాయి దందాకు పాల్పడుతున్నట్టు తెలిపారు. వీరిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి బాచుపల్లి ఠాణాకు తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు