అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేసేలా అనేక కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మిస్సోరీ తెలుగువారి కోసం వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్లు నిర్వహించింది. నాట్స్ మిస్సోరీ విభాగం ఆధ్వరంలో ఫెంటన్ మిస్సోరీలోని లెగసీ వీటీసీలోఈ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్లు జరిగాయి. తెలుగు క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపుతూ సాగిన ఈ క్రీడా సంబరం తెలుగు క్రీడా ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది. చెస్టర్ఫీల్డ్ సిటీ కౌన్సిల్ సభ్యుడు గ్యారీ చేతుల మీదుగా ఈ టోర్నమెంట్ను నాట్స్ ప్రారంభించింది. ఈ టోర్నమెంట్లలో మొత్తం 25 జట్లు, 200 మందికి పైగా ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ టోర్నమెంట్లు తెలుగువారి క్రీడా స్ఫూర్తిని, క్రీడల పట్ల ఉన్న మమకారాన్ని చాటి చెప్పాయి.
నాట్స్ మిస్సోరీ విభాగం విశేష కృషి
ఈ క్రీడా పోటీలు విజయవంతం కావడానికి నాట్స్ ప్రముఖులు, మిస్సౌరీ ఛాప్టర్ నాయకత్వం, మిస్సోరీ నాట్స్ సభ్యులు విశేష కృషి చేశారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రమేష్ బెల్లం, నాట్స్ పూర్వ అధ్యక్షులు ప్రస్తుత బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ మిస్సోరీ చాప్టర్ కో ఆర్డినేటర్ సందీస్ కొల్లిపరతో పాటు తెలుగు అసోషియేషన్ ఆఫ్ సెయింట్ లూయిస్ మాజీ అధ్యక్షుడు సురేంద్ర బాచిన, మధుసూదన్ దద్దాల, మురళి బందరుపల్లి వంటి ప్రముఖులు ఈ పోటీల నిర్వహణను పర్యవేక్షించారు.
నాట్స్ మిస్సోరీ ఛాప్టర్ బృందం తరుణ్ దివి, చైతన్య పుచకాయల, సంకీర్త్ కట్కం, రాకేష్ రెడ్డి మారుపాటి, సునీల్ స్వర్ణ, హరీష్ గోగినేని, నరేష్ రాయంకుల, నవీన్ కొమ్మినేని, శ్రీనివాస్ సిస్ట్ల తదితరులు ఈ టోర్నమెంట్ దిగ్విజయం కావడానికి ఎంతో కృషి చేచేశారు. నాట్స్ వాలంటీర్లు కూడా ఈ టోర్నమెంట్ కోసం విలువైన సమయాన్ని, సేవలను వెచ్చించారు.
విజేతలకు ట్రోఫీలు పంపిణీ:
ఐదు విభాగాలలో విజేతలు, రన్నరప్లకు నాట్స్ ట్రోఫీలను పంపిణీ చేసింది. క్రీడాకారుల అంకితభావం, ప్రతిభను ఈ సందర్భంగా నాట్స్ నాయకులు కొనియాడారు. నాట్స్ మిస్సోరి విభాగం వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను దిగ్విజయం చేయడంలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.