ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం : వెంకయ్య నాయుడు

మంగళవారం, 8 నవంబరు 2016 (08:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి మోసం జరుగుతున్నపుడు... ఇపుడు మాట్లాడే నేతలంతా ఎక్కడ ఉన్నారని ఆయన నిలదీశారు. 
 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోడీ, చంద్రబాబు, తాను మోసం చేశారంటూ చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. 'విభజన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?' అని కొందరు తనను ప్రశ్నిస్తున్నారని, ఐఐటీ, ఐఐఎం వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలు ఏపీకి వచ్చిన విషయాన్ని వారు గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు.
 
ఇవి చూసే వారికి కనిపిస్తాయని, వినే వారికి వినిపిస్తాయన్నారు. కానీ తాము అవి చూడబోమని, వినబోమని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామని అంటే తామేమీ చేయలేమని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేస్తున్నవారు అప్పుడు ఏమయ్యారని, ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వీటికి బదులిచ్చాకే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తే బాగుంటుందని వారికి సలహా ఇచ్చారు. అందువల్ల ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమన్నారు. 

వెబ్దునియా పై చదవండి