విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రార్థనా మందిరాల కూల్చివేత ప్రభుత్వానికి తీవ్ర సంకటం కాబోతోంది. నిన్నటి వరకూ దేవాలయాల కూల్చివేతపై హిందూ మతపెద్దలు నిరసన ప్రదర్శనలు చేశారు. వారికి హామీ ఇచ్చి సీఎం చంద్రబాబు కొంత సర్దుబాటు చేసుకున్నారు. ఇపుడు ముస్లిం మత పెద్దలు రంగంలోకి దిగుతున్నారు. ఇక్కడ దర్గాలు కూల్చివేశారని నిరసనకు దిగుతున్నారు.
ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విజయవాడ రానున్నారు. ఆగష్టు ఒకటిన అయన విజయవాడకు రోడ్డు మార్గం లేదా విమానంలో రావచ్చని అహాలే సున్నతుల్ జమాత్ ఫోరమ్ రాష్ట్ర కో కన్వీనర్ మౌలానా మొహమ్మద్ అల్తాఫ్ రజా వెల్లడించారు. విజయవాడ నగరంలో ఇటీవల అభివృద్ధి పేరుతో బ్యారేజి దగ్గర ఉన్న ప్రసిద్ధ దర్గాలను ఆధికారులు కూల్చి వేసిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అసదుద్దీన్ విజయవాడకు చేరుకునే సమయం ఇంకా నిర్ణయం కాలేదు.
దర్గాల విషయమై అసదుద్దీన్ అంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడును ముస్లిం సంఘాల నాయకులతో కలిసే అవకాశం ఉంది.. అసదుద్దిన్ ఒవైసి విమానంలో వస్తే గన్నవరం విమానయాశ్రమం నుంచి, రోడ్డు మార్గాన వస్తే ఇబ్రహింపట్నం జంక్షన్ నుంచి భారీ ర్యాలీగా తీసుకునే వచ్చేందుకు నగరంలో ముస్లిం సంఘాలు, స్థానిక ఎంఐఎం నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.