ఈ మూడు నెలలు గాడిదలు కాశారా? అచ్చెన్నాయుడు ఫైర్

శుక్రవారం, 30 ఆగస్టు 2019 (18:37 IST)
రాష్ట్రంలో అధికార వైకాపా నేతలపై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయిందనీ, ఈ మూడు నెలలు వైకాపా నేతలు గాడిదలు కాశారా అంటూ నిలదీశారు. 
 
ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాల్లో, టెండర్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయన్నారు. అమరావతిలో టీడీపీ నేతలకు భూములు ఉన్నాయని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు సబబు కాదన్నారు. రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం కరెక్టు కాదన్నారు. 
 
ఇన్నిరోజులు ఏం చేశారని ప్రశ్నించారు. దద్దమ్మలా? చేతకాని వాళ్లా? రికార్డులు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయిగా! ప్రభుత్వం వైసీపీదేగా, 90 రోజులు గాడిదలు కాశారా? అంటూ వైసీపీపై మండిపడ్డారు. తాము తప్పు చేస్తే కేసులు పెట్టాలే తప్ప, అవినీతి ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని వైసీపీ నేతలకు హితవు పలికారు. 
 
బంగారం లాంటి అమరావతి ప్రాజెక్టును నాశనం చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నాడు టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక ధర రెండు వేలు ఉంటే, ఇప్పుడు వైసీపీ హయాంలో దాని ధర 10 వేల రూపాయలు అయిందని, మిగతా ఎనిమిది వేలు ఏ పందికొక్కులు తింటున్నాయోనని మండిపడ్డారు. 
 
'ముఖ్యమంత్రి అంటే.. ఆలోచన ఉండాలి, సమస్యలపై అవగాహన ఉండాలి. అవగాహన, ఆలోచనలేని ఒక దుర్మార్గమైన వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన దౌర్భాగ్యం' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఏదైనా ఒక మంచి పని ద్వారా శుభకార్యానికి శ్రీకారం చుడతారు, కానీ, ఈ ముఖ్యమంత్రి, అమరావతిలోని ప్రజావేదికను కూల్చి అశుభకార్యానికి శ్రీకారం చుట్టారు. 
 
'నేను ఆరోజే అనుకున్నా. ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టింది. ఈ ఐదు సంవత్సరాల్లో అన్నీ అశుభాలే జరుగుతాయని అనుకున్నాను. తొంభై రోజుల్లో అవే జరుగుతున్నాయి. ఈ నాయకుడికి ముందుచూపు, అవగాహన లేవు. ఏ నిమిషానికి ఏం చేస్తాడో తెలీదు!' అని అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు