ఆనందయ్య ఆయుర్వేద మందు నిలిపివేత : జనం గుమికూడారంటూ కేసు

శుక్రవారం, 21 మే 2021 (18:45 IST)
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి కరోనా నివారణ ఔషధం అంటూ ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్నారు. ఈ మందును తాత్కాలికంగా నిలిపివేసారు. 
 
ఈ మందుపై సీఎం జగన్ కూడా దృష్టి సారించి, శాస్త్రీయ అధ్యయనం అవసరమని అభిప్రాయపడ్డారు. దీంతో నెల్లూరు జిల్లా యంత్రాంగం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు వివరణ ఇచ్చారు.
 
మూలికా ఔషధం పంపిణీ ఆపివేశామని, ఈ ఔషధం తాలూకు శాంపిళ్లను డీఎంహెచ్ఓ, ఆయుష్ అధికారులు హైదరాబాదులోని ఓ ప్రయోగశాలకు పంపారని వెల్లడించారు. 
 
దీనిపై ఐసీఎంఆర్ శాస్త్రీయ పరిశోధన చేయాల్సి ఉందని, ఆ పరిశోధనలో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే... ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని తెలిపారు. అప్పటివరకు మందు పంపిణీకి అనుమతి లేదని స్పష్టం చేశారు.
 
మరోవైపు, ఆయుర్వేద ఆనందయ్యపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. జనం ఎక్కువగా గుమిగూడారని ఆఫీస్‌కు పిలిపించి ఎస్పీ మాట్లాడారు. ఈ రోజు రాత్రికి ఐసీఎంఆర్ బృందం కృష్ణపట్నం రానుంది. అయితే ఆనందయ్య మందుకు రెండ్రోజుల్లో అనుమతులు వస్తాయని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. 
 
అనుమతులు వస్తే ఇతర రాష్ట్రాలకు కొరియర్ ఛార్జీలు భరించి.. తాము మందు పంపుతామని చెప్పారు. కృష్ణపట్నం పేరు ఇప్పుడు మారుమ్రోగుతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు అక్కడ ఉచితంగా మందు పంపిణీ చేస్తున్నారు. 
 
కాగా, ఇటీవల లోకాయుక్త ఆదేశాలతో అధికారులు మందు పంపిణీని నిలిపివేశారు. అయితే మందుపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. దీంతో శుక్రవారం నుంచి మళ్లీ మందు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. అయితే, కలెక్టర్ ఆదేశాలతో తాత్కాలికంగా నిలిపివేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు