ఆనందయ్య కరోనా మందుకు క్యూ కట్టిన జనం ...

శుక్రవారం, 21 మే 2021 (10:11 IST)
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో శుక్రవారం నుంచి కరోనా వైరస్‌ను అంతమొందించేదుకు ఆనందయ్య ఆయుర్వేద మందును పంపిణీ చేయనున్నారు. మందు కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. శుక్రవారం కేవలం పాజిటివ్ రోగులకే నిర్వాహకులు మందు పంపిణీ చేస్తామంటున్నారు. కొవిడ్ నిబంధనలకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు జనాన్ని అదుపు చేస్తున్నారు.  
 
అంతకుముందు సర్వేపల్లి ఎమ్మెల్యే, వైకాపా నేత కాకాణి గోవర్థన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కృష్ణపట్నంలో కరోనా మందు పంపిణీ శుక్రవారం నుంచి యథావిధిగా సాగుతుందని చెప్పారు. అందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. 
 
ప్రకృతిపరంగా దొరికే సహజసిద్ధమైన వస్తువులతో, ఆనందయ్య తయారు చేసే ఆయుర్వేద మందు పట్ల ఎటువంటి హానీ ఉండదన్నారు. కృష్ణపట్నంలో అందజేస్తున్న మందు వల్ల అనేకమంది కరోనా బారి నుండి బయటపడి, వారి ఆరోగ్యం కుదుటపడిందన్నారు.
 
ఆనందయ్య అందిస్తున్న మందు పట్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడానికి, తిరిగి ఆయుర్వేద మందును పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అందువల్ల శుక్రవారం నుంచి కరోనా సోకిన వారికి వేరుగా, కరోనా రాకుండా నియంత్రించడానికి వేరుగా భౌతిక దూరం పాటిస్తూ, మందు పంపిణీ చేపడుతున్నామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు