ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి బ్యాగులో నల్లధనం కట్టలు బయటపడినట్టు సమాచారం. ఎయిర్ పోర్టు అధికారుల తనిఖీలో ఈ విషయం బహిర్గతమైనట్టు ఎలక్ట్రానిక్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్గా వార్తలు వచ్చాయి. అయితే, కొద్దిసేపట్లో అది బ్లాక్మనీ కాదని తేలిపోయింది. తన దగ్గర ఉన్న డబ్బుకి లెక్క చూపించడంతో.. అది బ్లాక్మనీ కాదని అధికారులు తేల్చేశారు.
ఈ వివరాలను పరిశీలిస్తే... శనివారం ఉదయం వసుంధరా దేవి తిరుమల శ్రీవారు దర్శనం కోసం హైదరాబాద్ నుంచి స్పైస్జెట్ విమానంలో రేణిగుంట ఎయిర్ పోర్టుకు వచ్చారు. అయితే, అక్కడ చెక్పోస్ట్ దగ్గర చెకింగ్లో వసుంధరా బ్యాగ్లో రూ.10 లక్షల నోట్ల కట్టలను అధికారులు గుర్తించారు. ఆ డబ్బుకి వసుంధరా దేవి లెక్కలు చూపించమని అధికారులు కోరగా, ఆమె ఆ వివరాలన్నింటినీ సమర్పించారు. దీంతో అది నల్లధనం కాదని తేలిపోయింది. ఆ తర్వాత వసుంధర రోడ్డు మార్గం ద్వారా తిరుమలకి చేరుకొన్నారు.