అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి!!

ఆదివారం, 12 మార్చి 2023 (10:27 IST)
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థి ఒకరు అనుమానాస్పదంగా కన్నుమూశారు. అయితే, ఆయన్ను హత్య చేశారా? లేక ఆత్మహత్య చేశారా? అనే విషయంపై స్పష్టత రావాల్సివుంది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళికి చెందిన గోవాడ నాగసాయి గోపి అరుణ్‌కుమార్‌ (23)కు ఉన్నతవిద్యపై ఉన్న మక్కువను గుర్తించిన తల్లిదండ్రులు.. తమ ఆస్తులను కుదువ పెట్టి మరీ అమెరికాలో ఎంఎస్‌ చేసేందుకు ఏడు నెలల క్రితం పంపించారు. 
 
అక్కడికి వెళ్లిన అరుణ్‌కుమార్‌ ఈ నెల ఒకటి నుంచి కనిపించడంలేదని స్నేహితులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4వ తేదీన అతను ఉండే నివాసానికి సమీపంలోని సరస్సులో అరుణ్‌ మృతదేహం పోలీసులకు లభించిందని సన్నిహితులు వెల్లడించారు. మృతదేహానికి అమెరికా పోలీసులు శవపరీక్షలు నిర్వహించి, అక్కడి స్నేహితుల సహకారంతో స్వదేశానికి పంపించారు. 
 
కుమారుడి భౌతిక కాయాన్ని చూసిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పేద కుటుంబంలో జన్మించినా.. చదువులో రాణించిన కుమారుడికి విదేశాల్లో ఉన్నతవిద్యను అందించాలన్న వారి కలలు గల్లంతయ్యాయి. కన్న కొడుకు నిర్జీవంగా ఇంటికి రావడంతో ఆ కుటుంబీకులు తట్టుకోలేకపోతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు