పోలీస్ పెట్రోలింగ్ వాహనం సైరన్ విని మృత్యువాత.. ఎలా?

బుధవారం, 6 జూన్ 2018 (15:27 IST)
పోలీసు పెట్రోలింగ్ వాహనం సైరన్ విని ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. అదేంటి.. సైరన్ విని ఎలా చనిపోయారన్నదే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్‌ గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి పొలాల పక్కన బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు.
 
ఇంతలో అటుగా పోలీసు పెట్రోలింగ్ వాహనం వచ్చింది. ఆ వాహనం సైరన్ చప్పుడు విని శ్రావణ్‌తో పాటు స్నేహితులంతా తలో దిక్కుకు పరుగులు తీశారు. చీకట్లో వ్యవసాయ బావిని గమనించక శ్రావణ్ అందులో పడిపోయాడు. శ్రావణ్ కోసం అతడి స్నేహితులు గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులు పట్టుకెళ్లి ఉంటారని అందరూ భావించారు. ఇదే విషయంపై బుధవారం ఉదయం వెళ్లి విచారించగా తాము తీసుకురాలేదని పోలీసులు సమాధానం చెప్పారు. 
 
దీంతో మరోసారి శ్రావణ్ కోసం మొగ్దుంపూర్ వైన్స్ పరిసరాల్లో గాలించారు. ఈ గాలింపులో ఓ బావిలో శ్రావణ్ మృతదేహం కనిపించింది. శ్రావణ్ మరణ వార్తతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే.. పోలీసు పెట్రోలింగ్ భయంతో కరీంనగర్ రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోనే ఇప్పటివరకు ముగ్గురు వేర్వేరు ఘటనల్లో బావుల్లో పడి చనిపోవడం గమనార్హం. 
 
కాగా, మృతుని స్వస్థలం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్. స్థానిక నిగమ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుకుంటూ మొగ్దుంపూర్ హాస్టల్లో ఉంటున్నాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు