ఉగాదికి విద్యాశాఖ పోస్టుల భర్తీకి క్యాలెండర్ : విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

శుక్రవారం, 26 మార్చి 2021 (19:58 IST)
విద్యా శాఖలో పోస్టుల భర్తీకి సంబంధించిన క్యాలెండర్ ను రానున్న ఉగాదికి క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.  వచ్చే నెల 9వ తేదీన జగనన్న విద్యా దీవెన కింద ఫీజులు చెల్లిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు సచివాలయం నాలుగో బ్లాక్ లో మంత్రి శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని కళాశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు ఉద్యోగాలు లభించేలా విద్యా బోధన చేయనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. అక్రమాలకు పాల్పడే అటానమస్ కాలేజీల తీరు మార్చకోకుంటే తగిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

అటానమస్ కళాశాలలు ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 109 అటానమస్ కాలేజీలు పలు యూనివర్శిటీల పరిధిలో ఉన్నాయన్నారు. తమ పరిధిలోని అటానమస్ కాలేజీలకు ఆయా యూనివర్శీటీలే సిలబస్ మొదలుకుని ప్రశ్న పత్రాల రూపకల్పన, మూల్యాంకనం వంటివి చేపడతున్నాయని అన్నారు.

అటానమస్ కాలేజీల్లో నాణ్యమైన విద్య అందడంలేదని గుర్తించామన్నారు. అటానమస్ స్టేటస్ అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతుండడంతో పాటు ప్రభుత్వమిచ్చే రాయితీలను పొంది కొన్ని అటానమస్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు.

అటానమస్ కాలేజీల విషయమై యూజీసీతో కూడా సంప్రదింపులు జరుపుతామన్నారు. విద్యారంగం ఉమ్మడి జాబితాలో ఉందని.. కేంద్రమే కాదు.. రాష్ట్రమూ చట్టాలు చేయొచ్చునని మంత్రి పేర్కొన్నారు.యూజీసీ ఆమోదం ఉంది.. తమ జోలికి ఎవరూ రావద్దంటే కుదరదని మంత్రి స్పష్టం చేశారు. కాలేజీలన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉన్నాయన్నారు. ఏవైనా కళాశాలలు కోర్టులకు వెళ్తామనుకుంటే భావిస్తే వెళ్లొచ్చునన్నారు. 
 
అటానమస్ కాలేజీల్లో అకడమిక్ ఆడిట్...
డిగ్రీ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశ్యంతో అటానమస్ కాలేజీల్లో ఆడిట్ చేపట్టి, పరీక్ష విధానంలో సమూల మార్పులు తీసుకొస్తామని మంత్రి సురేష్ వెల్లడించారు. ఇకపై అటానమాస్ కాలేజీలు సొంతంగా ప్రశ్న పత్రాలు రూపొందించడం కుదరదని మంత్రి వెల్లడించారు.

నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం వలన ఉద్యోగాలు రావడం లేదని మంత్రి సురేష్ పేర్కొన్నారు. నైపుణ్యం లేని విద్య అక్కరకు రాదనేది ప్రభుత్వ భావన అని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు ఉన్నత విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఇక నుంచి డిగ్రీ తరగతులకూ అప్రంటీస్ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో డిగ్రీ విద్యా విధానం పరిశీలించిన తర్వాతే ఈ మార్పులు చేపట్టామని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర యూనివర్శిటీ, ఎస్వీ యూనివర్శిటీ, ఆర్జీయూకేటీ, జేఎన్టీయూ-కాకినాడ, అనంతపురం విషయంలో అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని సిఎం జగన్ ఆదేశించినట్లు మంత్రి సురేష్ వివరించారు.
 
వచ్చే నెల 9న జగనన్న విద్యా దీవెన...
ఏప్రిల్ 9న జగనన్న విద్యా దీవెన కింద ఫీజులు చెల్లిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో జగన్న విద్యా దీవెన నగదు జమచేయనున్నట్లు వెల్లడించారు. 10లక్షల మందికి పైగా విద్యార్ధులకు లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు.

జగనన్న విద్యా దీవెనతో పేద విద్యార్థుల చదువులకు ఇబ్బంది రాదనే భరోసా కలిగిందన్నారు. గత ఏడాదితో పోలిస్తే డిగ్రీ అడ్మిషన్లు 2.2 లక్షల నుంచి 2.7 లక్షల వరకు పెరిగాయని మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు.

ఉగాదికి పోస్టుల భర్తీకి క్యాలెండర్ విద్యా శాఖలో ఈ ఏడాది భర్తీ చేయనున్న పోస్టుల భర్తీకి సంబంధించిన క్యాలెండర్ ను ఉగాది రోజున విడుదల చేయనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు క్యాలెండర్  విడుదల చేయునున్నట్లు తెలిపారు.

ఒంగోలు,శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు వీలైంనంత త్వరగా నిధులు విడుదల చేయాలని ఆర్ధిక శాఖను ముఖ్యమంతి ఆదేశించినట్లు మంత్రి సురేష్ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు