జన్మదిన శుభాకాంక్షలు అందుకోలేను... అందుకే దైవ చింతనలో గడిపా: ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

గురువారం, 2 సెప్టెంబరు 2021 (22:07 IST)
త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా అభిమానులు, పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు చూపిన ప్రేమాభిమానాలు వెల‌క‌ట్ట‌లేనివ‌ని జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్నారు. ఈ సంద‌ర్భంగా వారికి కృత‌జ్ఙ‌త‌లు తెలిపారు.

ప‌వ‌న్ ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే... "ఎనలేని ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. నా చుట్టూ ఉన్న సమాజం ఎల్లవేళలా క్షేమంగా ఉండాలనే భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటాను. యేడాదిన్నర కాలంగా దేశం కరోనా మహమ్మారితో పోరాడుతూనే ఉంది. సెకండ్ వేవ్ ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది.

కష్ట జీవుల జీవనం ఇంకా గాడినపడలేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో జన్మదిన శుభాకాంక్షలు అందుకోలేను అనే ఉద్దేశంతో దైవ చింతనలో గడిపాను. సహజంగానే నేను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటానని నన్ను అభిమానించేవారికి తెలుసు.

నాపై ఉన్న అపార ప్రేమాభిమానాలతో ఎందరో హితైషులు, సన్మిత్రులు, శ్రేయోభిలాషులు, సమాజ సేవకులు, రాజకీయ నేతలు, సినీ తారలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, మీడియా ప్రతినిధులు, ప్రవాస భారతీయులు, నన్ను తమలో ఒకడిగా భావించే అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు అందచేశారు.

జనసేన శ్రేణులు, అభిమానులు సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టి తమ అభిమానాన్ని సేవామార్గంలో వెల్లడించారు. పెద్దలు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు శుభాశీస్సులు అందించారు. ప్రతి ఒక్కరూ ఎంతో వాత్సల్యంతో నాకు శుభాకాంక్షలు అందించారు. వెల కట్టలేని ఈ అభిమానానికి, వాత్సల్యానికి నేను సర్వదా కృతజ్ఞుడిని. అందరికీ పేరుపేరునా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను."

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు