తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై సమావేశం.. ఎజెండాలోని కీలకాంశాలు

శనివారం, 12 ఫిబ్రవరి 2022 (17:38 IST)
తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు లేఖలు రాసింది. ఈ నెల 17న విభజన సమస్యలపై సమావేశం నిర్వహించనున్నట్టుగా తెలిపింది. కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.
 
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అంశాలపై ప్రధానంగా చర్చలు జ‌రుగుతాయి. ఏయే అంశాలు చర్చించాలన్న విష‌యంపై అధికారులకు కేంద్ర హోంశాఖ ఇప్ప‌టికే సమాచారం అందించింది. 
 
షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల విభజన, ఆస్తుల పంపకాలపై చర్చ జ‌రుపుతామ‌ని తెలిపింది. అలాగే, ఆర్థికపరమైన అంశాలపై చర్చ జ‌ర‌గ‌నుంది. స‌మావేశ అజెండాలో ప్ర‌త్యేక హోదా అంశం కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. వ‌న‌రుల స‌ర్దుబాటు, 7 వెన‌క‌బ‌డిన జిల్లాల అభివృద్ధికి నిధుల విడుద‌ల అంశం కూడా ఉన్నాయి.
 
కమిటీ సమావేశంలో ఎజెండాలోని కీలక అంశాలు..
1. ప్రత్యేక హోదా
2. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన
3. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ సమస్యల పరిష్కారం
4. పన్నుల వ్యవహారంపై చర్చ
5. క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ డిపాజిట్ విభజన
6. వనరు వ్యత్యాసంపై చర్చ
7. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి గ్రాంట్ పై చర్చ
8. పన్నులు, ప్రోత్సాహాలు
9. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ల మధ్య క్యాష్ క్రెడిట్‌పై చర్చ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు