పెన్నా నది కట్టపై కొందరు ఇళ్లు కోల్పోయే అవకాశం!

ఆదివారం, 29 నవంబరు 2020 (18:43 IST)
పెన్నా బ్యారేజీ నుంచి వెంకటేశ్వరపురం జాతీయ రహదారి వరకు బ్రిడ్జి ఇరువైపుల బండ్స్‌ వేసి అత్యాధునిక నిర్మాణాలు చేపడుతామని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఆదివారం నెల్లూరులోని రంగనాయకులపేట వద్ద పెన్నా బ్యారేజీని ఇరిగేషన్‌ శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి ఎం.గౌతంరెడ్డితో కలిసి సందర్శించారు.

నివర్‌ తుపాను ప్రభావంతో, జిల్లాలో కురిసిన భారీ వర్షాల ధాటికి వస్తోన్న వరదనీటిని మంత్రులు పరిశీలించారు. ప్లడ్‌ మేనేజ్‌ మెంట్‌ విషయంలో అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం భగత్‌ సింగ్‌ నగర్‌, జనార్థన్‌ రెడ్డి నగర్‌, అహ్మద్‌ నగర్‌ ప్రాంతాలల్లో మంత్రులిద్దరు పర్యటించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ వరదతో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం వారికి అండగా ఉంటుందన్నారు. బాధితులందరికి ప్రభుత్వం న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. జిల్లా చరిత్రలోనే 2వ సారి పెన్నాకి ఈ స్థాయిలో వరద నీరు వచ్చిందన్నారు.

భారీగా వరద నీరు వస్తుండటంతో నదీ పరివాహక ప్రాంతాలు, నెల్లూరు నగరంలోని లోతట్టు ప్రాంతాల నీట మునిగాయన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉన్న ప్రజలను రిలీఫ్‌ సెంటర్ల తరలించి భోజనం అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రిని కలిసి జిల్లాకు జరిగిన నష్టాన్ని వివరిస్తామన్నారు. ఇప్పటికే దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలు, చెరువు కట్టలపై ఎస్టిమేషన్స్‌ తయారు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.

8 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా పెన్నా వారధి నుంచి బ్రిడ్జి వరకూ రెండు వైపులా బండ్స్‌ నిర్మించడానికి ఎస్టిమేషన్స్‌ సిద్ధం చేయాలని అధికారులను అదేశించామన్నారు. ఈ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. బండ్స్‌ నిర్మాణంతో పెన్నా నది కట్టపై ఉన్న కొందరు ఇళ్లు కోల్పోయే అవకాశం ఉందన్నారు.

వారందరికీ ఇళ్ల పట్టా ఇవ్వడంతో పాటు ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. నీటి ముంపునకు గురైన భగత్‌ సింగ్‌ కాలనీ, అహ్మద్‌ నగర్‌ తో పాటు.. పెన్నా వారధి పక్కన ఉన్న కాలనీల్లోని ప్రజలకు భోజనం, ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందజేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. నివర్‌ తుపానుతో జిల్లాలో జరిగిన నష్టంపై నివేదికను అందిస్తామన్నారు.

ఇప్పటికే జిల్లా అధికారులతో నివర్‌ తుపాను వలన కలిగిన నష్టంపై రివ్యూ మీటింగ్‌ నిర్వహించామన్నారు. భారీ వర్షాలతో రైతులు పండించిన పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. దీనిపై నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. నివేదిక అందిన వెంటనే నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకూ పంటనష్ట పరిహారం అందిస్తామన్నారు.

జిల్లాలో ప్రాణనష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారన్నారు. మరో తుపాను వస్తుందని వాతావరణ శాఖ అధికారులు జిల్లాకు ముందస్తు హెచ్చరికలు అందజేశారన్నారు. ఈ హెచ్చరికలు పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్కరూ అధికారి ప్రభుత్వ సూచనలు పాటిస్తూ, ప్రజలకు సహాయం చేయా లన్నారు.

ఈ పర్యటనలో మున్సిపల్‌ కమిషనర్‌ దినేష్‌ కుమార్‌, ఆర్‌.డి.ఒ. హుస్సేన్‌ సాహెబ్‌, విజయ డైయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డిరంగారెడ్డి, అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు