హస్తినలో అర్థరాత్రి అమిత్ షా‌తో చంద్రబాబు సమావేశం!!

ఠాగూర్

గురువారం, 8 ఫిబ్రవరి 2024 (09:01 IST)
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఓ గంటపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ వివిధ అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఇటు అసెంబ్లీ ఎన్నికలతో పాటు అటు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణణంలో వీరిద్దరూ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా, ఎన్డీయే కూటమిలో టీడీపీ చేరే అంశంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై కూడా వీరిద్దరూ చర్చించినట్టు తెలుస్తుంది. 
 
అమిత్ షా నివాసంలో జరిగిన ఈ భేటీలో అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. రాత్రి 11.25 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం దాదాపు గంటపాటు సాగినట్టు సమాచారం. బుధవారం పార్లమెంట్ సమావేశాలు రాత్రి పొద్దుపోయే వరకు జరిగాయి. ఈ కారణంగానే అమిత్ షా - చంద్రబాబుల భేటీ కూడా ఆలస్యంగా ప్రారంభమైనట్టు తెలుస్తుంది. 
 
దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ, టీడీపీలు ఈ సమావేశంలో ఓ అవగాహనకు వచ్చినట్టు సమాచరాం. దేశాన్ని మరింతగా బలోపేతం చేయాలంటే అన్ని ప్రాంతాల్లో తమ కూటమి అవసరమని ఈ సందర్భంగా చంద్రబాబుతో అమిత్ షా అన్నట్టు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఏకంగా 400కు పైగా సీట్లు వస్తాయని కమలనాథులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఒక్క బీజేపీకే 350 పైచిలుకు సీట్లు వస్తాయని భావిస్తున్నారు. దీంతో ఎన్డీయే కూటమిలో టీడీపీ కూడా చేరాలని బాబును చంద్రబాబు కోరినట్టు సమాచారం. 
 
కాగా, అమిత్ షా పిలుపుమేరకు.. బుధవారం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. సాయంత్రం 6.30 గంటలకు హస్తినకు చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్, కె.రామ్మోహన్ నాయుడు, రఘురామకృష్ణంరాజులు స్వాగతం పలికారు. ఆ తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, బీజేపీవి దేశ ప్రయోజనాలు అయితే, టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు పని చేస్తుందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు