అందరి భవిష్యత్తును 'మోది' అంధకారం చేశారు... చంద్ర‌బాబు

శనివారం, 9 ఫిబ్రవరి 2019 (14:45 IST)
టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఇందులో ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. బందరు పోర్టు పనులకు శంకుస్థాపన ఒక చరిత్ర. దశాబ్దాల కలను నిజం చేస్తున్నాం. కౌన్సిల్ ఛైర్మన్‌గా షరీఫ్ బాధ్యతలు చేప‌ట్ట‌డం చారిత్రక ఘట్టం. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కౌన్సిల్ ఛైర్మన్ స్థాయికి షరీఫ్ ఎదిగారు. పార్టీలో పని చేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది. అందుకు షరీఫ్ ఎదుగుదలే ఉదాహరణ అని చెప్పారు. 
 
బాలయోగిని లోక్‌సభ స్పీకర్ చేశాం. ప్రతిభాభారతిని అసెంబ్లీ స్పీకర్ చేశాం. ఇప్పుడు షరీఫ్‌ను కౌన్సిల్ ఛైర్మన్ చేశాం. సామాజిక న్యాయమే టీడీపీ మూల సూత్రం. కులాల పేరుతో ప్రతిపక్షం విడదీసే కుట్రలు చేస్తుంది. ప్రజలే వాటికి గుణపాఠం చెబుతారు. బిసిలకు సబ్ ప్లాన్ చట్టబద్దత ఇస్తున్నాం. అగ్రిగోల్డ్ బాధితులకు రూ.250 కోట్లు ఆదేశాలు ఇచ్చాం. అందరి భవిష్యత్తును మోది అంధకారం చేశారు అంటూ బాబు మోదిపై ధ్వ‌జ‌మెత్తారు.
 
రాజ్యాంగ హక్కులపై దాడులు చేస్తున్నారు. 23 పార్టీల మహాకల్తీ అనడం మోది దిగజారుడుతనం. నరేంద్ర మోది మాటల గారడి-జగన్మోహన్ రెడ్డి మోసాల గారడి. బ్యాంకులను మోది నిర్వీర్యం చేశారు. ఏటిఎంల మూత బ్యాంకులు బలోపేతం చేయడమా..? వేల కోట్లు ఎగ్గొట్టి పరార్ కావడం బ్యాంకుల బలోపేతమా..? అని ప్ర‌శ్నించారు. దోపిడిదారులను దేశం దాటించి నీతివాక్యాలా..? అంటూ కేంద్రంలో బిజెపి పాలనపై చంద్రబాబు ఆగ్రహం వ్య‌క్తం చేసారు. గల్లా జయదేవ్ ప్రసంగాన్ని చంద్ర‌బాబు అభినందించారు. టీడీపీ ఎంపిల స్ఫూర్తి అందరిలో రావాలి. మంచిని మంచిగా చెప్పే ధైర్యం... చెడును చెడుగా చెప్పే ధైర్యం బిజెపికి లేదు అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు