విజయవాడ : బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న దుర్గగుడి ఫ్లైవోవర్ పనులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. 330 కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ పొంది పనులు చేస్తున్న సోమా కంపెనీకి చీవాట్లు పెట్టారు. ఇవేం పనులు ... నా జీవితంలో ఇలాంటి పనులు చూడలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ రోజు విజయవాడలో కృష్ణానది పుష్కరాల పనులను తనిఖీ చేశారు. పుష్కర ఘాట్లను పరిశీలించారు. దుర్గ, కృష్ణవేణి, పద్మావతి పుష్కర ఘాట్ల వద్ద నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న సోమా కంపెనీ ప్రతినిధులపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు జరుగుతున్న తీరుపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తపరిచారు.
తన జీవితంలో తొలిసారి ఇలాంటి పనులు చూస్తున్నానని, పనుల్లో పురోగతి లేకుంటే కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. కృష్ణా పుష్కరాల సమయానికి ఆగస్టు నాటికి ఫ్లైవోవర్ నిర్మాణం, 4 లైన్ల రోడ్ల నిర్మాణం పూర్తికావాలని చెప్పినా... ఇంకా పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జులై 1న మరోసారి వచ్చి పనులను పరిశీలిస్తానని చంద్రబాబు సోమా ప్రతినిధులకు తెలిపారు.