కలియుగదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైవున్న పవిత్ర తిరుమల క్షేత్రానికి వెళ్లే మార్గంలో చికెన్ బిర్యానీ హోటల్ పెట్టినట్టు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా, తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ఈ ప్రచారం సాగుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఆలయ పవిత్రత, భక్తుల మనోభావాలను దెబ్బతీయాలన్న ఏకైక ఉద్దేశ్యంతో కొందరు కావాలని అసత్య వీడియోలను వైరల్ చేస్తున్నారని ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ విభాగం పేర్కొంది.
అలిపిరి నడక మార్గంలో చికెన్ బిర్యానీ హోటల్కు సంబంధించిన ప్రకటనలను ఉంచినట్లు చెబుతూ ఒక నకిలీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చంద్రగిరి వైపు వెళ్లే రోడ్డులోని ఒక హోటల్ ప్రకటనకు స్వామివారి పవిత్ర నామం ఆడియోను జత చేసి, తిరుమల పరిధిలో పెట్టినట్లుగా అపోహ కలిగించే ప్రయత్నం చేసినట్లు గుర్తించామని ఫ్యాక్టిక్ విభాగం తెలిపింది.
ఈ అంశంపై అధికారికంగా స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే), వీడియో పూర్తిగా నకిలీదని స్పష్టం చేసింది. వీడియోలో చూపిన ప్రాంతం తిరుమల పరిధిలోకి రాదని, అది చంద్రగిరి రహదారిలో ఉన్న ప్రాంతమని తేల్చి చెప్పింది. శ్రీవారి పవిత్రతను దెబ్బతీసేలా తప్పుడు వీడియోలు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.