ఢిల్లీలో రైతుల దీక్ష.. భారత్‌ బంద్‌కు జగన్ సర్కారు సంపూర్ణ మద్దతు

సోమవారం, 7 డిశెంబరు 2020 (20:55 IST)
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు దీక్ష చేపట్టిన విషయం విదితమే. రైతన్న దీక్షకు మోదీ సర్కార్ దిగిరాకపోవడంతో.. రైతులపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 8న (బుధవారం) రైతు సంఘాలు తలపెట్టిన భారత్‌ బంద్‌ విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ బంద్‌కు ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. 
 
బంద్ సందర్భంగా బుధవారం ఏపీలో విద్యా సంస్థలు బంద్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  ఒంటి గంట తర్వాతనే ప్రభుత్వ కార్యాలయాలను తెరవాలని ఆదేశించింది. ఏపీలో ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపొద్దని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. బంద్ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని రైతు సంఘాలకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 
 
కాగా.. భారత్‌ బంద్‌ పిలుపునకు టీఆర్ఎస్, కాంగ్రెస్‌తోపాటు ఆర్జేడీ, తృణమూల్‌ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, ఆర్‌ఎస్‌పీ, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ తదితర వామపక్షాలు, డీఎంకే మద్దతు ప్రకటించిన విషయం విదితమే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు